మాల్దీవుల్లో ఇద్దరు జర్నలిస్టుల అరెస్టు: ఒకతను ఇండియన్
మాలే: అత్యవసర పరిస్థితి అమలవుతున్న నేపథ్యంలో దేశ భద్రత పేరు చెప్పి మాల్డీవుల్లో ఇద్దరు జర్నలిస్టులను అరెస్టు చేశారు. వారిలో ఒకతను భారతీయుడు కాగా, మరొకతను భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు.
పంజాబ్కు చెందిన మనీ శర్మ, లండన్కు చెందిన అతీష్ రావ్జీ పటేల్ ఎఎఫ్పి న్యూస్ ఏజెన్సీకి రిపోర్టర్లుగా పనిచేస్తున్నారు. జర్నలిస్టుల అరెస్టుపై జాయింట్ అపోజిషన్ అధికార ప్రతినిధి అహ్మద్ మహ్లూఫ్ స్పందించారు.మాల్దీవుల్లో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలిసిపోతుందని ప్రభుత్వం భయపడుతోందని అన్నారు.
ఇక ఎంత మాత్రం పత్రికా స్వేచ్ఛ లేదని, గత రాత్రి ప్రముఖ టీవీ స్టేషన్లను మూసేశారని అధాలత్ పార్టీ డిప్యూటీ లీడర్ అలీ జహీర్ అన్నారు.
మాల్దీవుల్లో ఇద్దరు విదేశీ జర్నలిస్టులను అరెస్టు చేశారని, వారిలో ఒకతను భారతీయుడు కాగా, మరొకతను బ్రిటిష్ అని, వారు ఎఎఫ్పి ఉద్యోగులని విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి అబ్దుల్లా షాహిద్ అన్నారు.