శ్రీలంక నరమేధంలో 359కి చేరిన మృతులు..ఆత్మాహుతి దాడిలో మహిళ పాల్గొన్నట్లు గుర్తింపు..
కొలంబో : ఈస్టర్ పర్వదినాన ముష్కరుల సృష్టించిన విధ్వంసం నుంచి శ్రీలంక ఇంకా తేరుకోలేకపోతోంది. వరుస బాంబుదాడుల్లో మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు ఇంతటి ఘాతుకానికి పాల్పడిన నిందితుల కోసం పోలీసుల గాలింపు ముమ్మురం చేశారు. దాడికి పాల్పడిన ఆత్మాహుతి సభ్యుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
శ్రీలంకలో మరో బాంబు పేలుడు..ఈసారి థియేటర్ వద్ద పేలిన బాంబు
359కి చేరిన మృతులు
ఆదివారం నాడు శ్రీలంకలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో మృతుల సంఖ్య 359కి చేరింది. దాడిలో తీవ్రంగా గాయపడిన వారిలో 38మంది మంగళవారం రాత్రి చనిపోయారు. మరో 500 మంది క్షతగాత్రులకు వివిధ హాస్పిటల్స్లో చికిత్స అందిస్తున్నారు. దాడి జరిగిన నాటి నుంచి 38మంది విదేశీయులు ప్రాణాలకోల్పోగా.. వారిలో 10 మంది భారతీయులు ఉన్నారు.
దాడికి పాల్పడిన వారిలో మహిళ
శ్రీలంకలో బాంబు దాడులకు పాల్పడిన తొమ్మిది మందిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ రువాన్ వాజేవర్థనే ప్రకటించారు. ఆత్మాహుతికి పాల్పడిన వారిలో చాలా మందికి అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలున్నాయని, వారందరూ విదేశాల్లో నివసించిన లేదా చదువుకున్నవారేనని చెప్పారు. ముష్కరుల్లో ఒకడు బ్రిటన్, ఆస్ట్రేలియాల్లో చదువుకున్నారని, అందుకోసం ఐఎస్ఐఎస్ నుంచి వారికి నిధులు అంది ఉంటాయని వాజేవర్థనే అనుమానం వ్యక్తంచేశారు.
మరో 18 మంది అరెస్ట్
కొలంబోలో నరమేధం సృష్టించిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. పోలీసులు మంగళవారం రాత్రి మరో 18మంది అనుమానుతుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరిలో కలిపి ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేసిన వారి సంఖ్య 60కి చేరింది. ఉగ్రవాదులు మరిన్ని దాడులు జరిపే అవాకాశముందన్న సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమసింఘే పిలుపునిచ్చారు.