మహమ్మారి! కరోనా సోకి 29 రోజుల పసికందు మృతి: ప్రపంచంలో అతిపిన్న బాధితుడు
ఫిలిప్పీన్స్: ప్రపంచ వ్యాప్తంగా అనేక వేల మంది ప్రాణాలు తీసిన కరోనా మహమ్మారి 29 రోజులు పసికందును కూడా వదల్లేదు. ఫిలిప్పీన్స్లోని బటంగస్ ప్రావిన్స్కు చెందిన 29 రోజుల శిశువు కరోనాబారినపడి ప్రాణాలు కోల్పోయాడు. ప్రపంచంలో కరోనా బారినపడి మరణించిన అత్యంత పిన్న కరోనా బాధితుడిగా ఈ పసికందే కావడం గమనార్హం.
అత్యంత పిన్నవయస్కుడి మరణం..
కరోనా బారినపడిన ఈ చిన్నారికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో వైద్యులు పసికందుకు అత్యవసర చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. హెల్త్ అండర్ సెక్రటరీ మారియా రోసారియో వెర్జేర్ మాట్లాడుతూ.. బటంగస్లో కొవిడ్-19 సోకి అత్యంత పిన్న పసికందు మరణించడం ఇదే తొలిసారని చెప్పారు. తీవ్రమైన శ్వాసకోశ సంక్రమణ కారణంగా ఇబ్బంది పడిన ఈ చిన్నారిని ఆలస్యంగా సెప్సిస్ చికిత్స తీసుకురావడంతో అతడు మరణించాడని తెలిపారు. ఇంతకుముందు ఫిలిప్పీన్స్లో ఏడేళ్ల చిన్నారి కరోనావైరస్ సోకి మరణించింది.
పెరుగుతున్న కేసులు, మరణాలు..
బుధవారం మరో 14 కరోనా మరణాలు సంభవించాయని, కొత్తగా 230 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఫిలిప్పీన్స్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా కారణంగా దేశంలో మరణాల సంఖ్య 349కి చేరగా, మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 5,453కు చేరినట్లు పేర్కొంది. 58 మంది కరోనా నుంచి కోలుకున్నారని, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 353కి చేరుకుందని వెల్లడించింది.
Recommended Video
ఉల్లంఘిస్తే కాల్చి పారేస్తామంటూ అధ్యక్షుడి హెచ్చరికలు
కరోనా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నవారిని కఠినంగా శిక్షిస్తామని ఇప్పటికే ఆ దేశ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అంతేగాక, కొవిడ్-19 క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించినవారిని కాల్చిపారేస్తామంటూ ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటర్టే తీవ్రమైన హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కు బానిసైన వారికి, డ్రగ్స సరఫరా చేసే వారి కోసం, ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారి కోసం బాడీ బ్యాగ్స్ సిద్ధంగా ఉన్నాయంటూ హెచ్చరించారు. దేశంలో డ్రగ్స్ వాడకాన్ని తగ్గించేందుకు అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఇప్పటికే వేలాది మందిని కాల్చి చంపేయడం గమనార్హం. అయితే, చంపేస్తామంటూ ప్రకటనలు చేయడం సరికాదని దేశంలోని పలువురు మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.