జపాన్లో ఉన్మాది వీరంగం.. కత్తిపోటుతో చిన్నారి మృతి, 17మందికి గాయాలు
జపాన్లో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. కవాసకి నగరంలో కత్తితో వీరంగం సృష్టించాడు. స్కూల్ బస్సు కోసం ఎదురుచూస్తున్న చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో ఓ చిన్నారి చనిపోగా.. మరో 17మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 13 మంది స్కూల్ విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఉదయం ఏడున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. స్కూల్కు వెళ్లేందుకు బస్టాప్కు వచ్చిన చిన్నారులు లక్ష్యంగా ఉన్మాది దాడికి దిగాడు. విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో బస్టాండ్ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. చిన్నారుల రోదనలు, హాహాకారాలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది.
కత్తితో పలువురిపై దాడి చేసిన అనంతరం ఉన్మాది ఆత్మహత్య చేసుకున్నారు. తనను తాను పొడుచుకుని చనిపోయాడు. విషయం తెలిసిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు. గాయపడినవారిలో చాలా మంది చిన్నారులు పదేళ్లలోపు వారేనని సమాచారం. కత్తిపోట్లకు గురైన వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెప్పారు.
ప్రపంచంలో అతితక్కువ నేరాలు జరిగే దేశాల్లో జపాన్ ఒకటి. 2018లో ఓ వ్యక్తి బుల్లెట్ ట్రైన్లో ఓ వ్యక్తిని పొడిచి చంపగా... మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచాడు. 2016లో టోక్యోలో ఓ దుండగుడు మానసిక రోగంతో బాధపడుతున్న 19 మందిని పొట్టనబెట్టుకున్నాడు. ఈ రెండు ఘటనలు మినహా ఈ మధ్యకాలంలో జపాన్లో భారీ నేరాలు జరిగినదాఖలాలు లేవు.