coronavirus: యూకేలో వైద్య సిబ్బందికి కూడా రక్కసి, 34 శాతం మందికి పాజిటివ్..
కరోనా వైరస్ సోకిన రోగులకు చికిత్స అందించిన బ్రిటిష్ వైద్య సిబ్బందికి జబ్బు అంటుకుంది. ఇటీవల 16 వేల 888 మందికి పరీక్ష చేయగా.. అందులో 34 శాతం అంటే 5733 మందికి వైరస్ సోకిందని బ్రిటిష్ అధికారులు ధృవీకరించాయి. వీరిలో వైద్య సిబ్బందితోపాటు వారి కుటుంబసభ్యులు కూడా ఉన్నారు.
బ్రిటన్లో ఆరోగ్య కార్యకర్తలకు వైరస్ సోకడంతో, వారి కుటుంబసభ్యులకు కూడా పర్సనల్ ప్రొటెక్టివ్ కిట్స్ అందజేస్తామని అధికారులు పేర్కొన్నారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారికి కిట్లు అందజేస్తామని యూకే ఆరోగ్య కార్యదర్శి మ్యాట్ హ్యన్కూక్ పేర్కొన్నారు. అయితే యూరొపియన్ దేశాల కన్నా యూకేలో వైద్య పరీక్షలు సామర్థ్యం తక్కువగా ఉంది. దీనిని నెలాఖరు వరకు రోజుకు 10 వేల నుంచి లక్ష వరకు పెంచుతామని హ్యన్కూక్ తెలిపారు. ఈ నెల 12వ తేదీన 14 వేల 506 పరీక్షలు చేశామని పేర్కొన్నారు.
కరోనా వైరస్ సోకి ఇప్పటికే 19 మంది వైద్య సిబ్బంది చనిపోయారు. అయితే వారి రక్షణ కోసం మెడికల్ కిట్లను అందజేయకపోవడంతోనే చనిపోయారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాయల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కీలక సూచన చేసింది. సంబంధిత విభాగం సరైన వసతులు, కిట్లు అందజేయకుంటే వైద్య సిబ్బంది/నర్సులు విధులు నిర్వహించేందుకు నిరాకరించాలని సూచించింది. దీంతో పరిస్థితి తీవ్రతకు అద్దంపట్టింది.