అక్షయ్ సినిమాలో వలె: సూడాన్ నుంచి 'ఎయిర్ లిఫ్ట్'
న్యూఢిల్లీ: దక్షిణ సూడాన్ అంతర్యుద్ధంతో నలిగిపోతోంది. అక్కడి పరిస్థితుల నేపథ్యంలో భారతీయులను వెనక్కి తీసుకు వచ్చేందుకు భారత వైమానిక దళం నడుం కట్టింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
అక్కడ ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు 'ఎయిర్ లిఫ్ట్' సినిమాలో వలే ఎయిర్ ఇండియా విమానాలు తీసుకు రానున్నాయి. ఇటీవల అక్షయ్ కుమార్ నటించిన ఎయిర్ లిఫ్ట్ సినిమా వచ్చి, అందర్నీ అలరించిన విషయం తెలిసిందే.
ఈ విమానాలతో పాటు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ కూడా వెళ్లారు. సూడాన్ చేరుకున్న ఆయన.. పరిస్థితిని అక్కడి ఆర్థిక మంత్రితో సమావేశమై తెలుసుకున్నారు. భారత వైమానిక దళానికి చెందిన రెండు సీ 17 గ్లోబ్ మాస్టర్ రకం విమానాలను పంపించారు.
సూడాన్లో ఉన్న దాదాపు మూడు వందల మంది భారతీయులను స్వదేశానికి తీసుకు రానున్నారు. సూడాన్ రాజధాని జుబా నగరంలో తొలి విమానం ల్యాండ్ అయింది. దీనికి 'ఆపరేషన్ సంకట్ మోచన్' అని పేరు పెట్టారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ బృందంలోని అక్కడి భారతీయ సైనికులు కూడా సహకరిస్తున్నారు.