ఫేస్ బుక్ లో ఫేక్ పోస్టింగ్, కంబోడియా విపక్షనేతకు ఐదేళ్ళ జైలు శిక్ష
పేస్ బుక్ లో తప్పుడు ప్రచారం చేసిన కంబోడియా విపక్షనేత శ్యామ్ రెయిన్సీకి ఐదేళ్ళపాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
కంబోడియా :సోషల్ మీడియాద్వారా మంచిని,చెడును కూడ విస్తృతంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. అయితే ఫేస్ బుక్ లో తప్పుడు ప్రచారం చేసిన కంబోడియాకు చెందిన విపక్ష నేతకు ఐదేళ్ళపాటు జైలు శిక్షను విధించారు.
కంబోడియాకు చెందిన విపక్ష నాయకుడు శామ్ రెయిన్సీ తన ఫేస్ బుక్ లో తప్పుడు పోస్టు పెట్టి జైలు పాలయ్యాడు. తమకు సరిహద్దులో ఉన్న వియత్నాంతో కొన్ని ఒప్పందాలు, సరిహద్దు విషయమై సంప్రదింపులకు అంగీకరించినట్టు ఆయన తన ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు.
అయితే తప్పుడు సమాచారాన్ని ఫేస్ బుక్ లో పోస్టు చేసినందుకుగాను ఆయనకు ఫెనాం పెన్హ్ మున్సిఫల్ కోర్టు విచారణ జరిపి ఐదేళ్ళ పాటు జైలు శిక్ష ను విధిస్తూ తీర్పు చెప్పింది.
కొంతకాలంగా అధికార కంబోడియన్ పీపుల్స్ పార్టీ నేత, ప్రధాని హాన్ సేన్, విపక్ష పార్టీ కంబోడియా నేషనల్ రెస్క్యూ పార్టీల మద్య ఈ విషయమై వివాదం సాగుతోంది. వియాత్నం, కంబోడియా దేశాల నేతలతో శామ్ రెయిన్సీ టీమ్ చేసిన ఫేక్ పోస్టు సంచలనం కల్గించింది. ఇరుదేశాల మద్య వివాదాలకు కారణమయ్యేలా ఈ పోస్టులు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఈ రెండు దేశాల మద్య 1979 లో జరిగిన ఒప్పందాలపై శ్యామ్ రెయిన్సీ, అంగ్ చంగ్ లియాంగ్, సత్యాసంబాత్ దుష్ప్రచారం చేశారని కోర్టు నిర్థారించింది. శ్యామ్ రెయిన్సీకి ఐదేళ్ళు శిక్ష విధించగా, మిగిలిన ఇద్దరికీ మూడేళ్ళపాటు జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
2013 లో జరిగిన ఎన్నికల్లో కంబోడియన్ నేషనల్ రెస్క్యూ పార్టీ 55 స్థానాలను కైవసం చేసుకొంది. అధికార కంబోడియన్ పీపుల్స్ పార్టీ 68 స్థానాల్లో విజయం సాధించింది. కోర్టు తీర్పుతో విపక్ష పార్టీ నేత జైలు కు వెళ్ళాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.