సెక్సీ షో: కొరడాలతో కొట్టాలన్న లంక అధ్యక్షుడు
కొలంబో: శ్రీలంకలోని కొలంబోలో ఇటీవల పాప్స్టార్ ఎన్రిక్ ఇగ్లెసియాస్ ప్రదర్శనపై శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రదర్శన ఏర్పాటుచేసిన నిర్వాహకులను విషంపూసిన కొరడాతో కొట్టాలని సిరిసేన మండిపడ్డారు. ఆ దర్శన అనాగరికంగా కొనసాగడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
డిసెంబర్ 20న జరిగిన సంగీత కచేరీ అనంతరం స్థానిక మహిళలు వేదికపైకి ఎక్కి ఇగ్లెసియాస్ను కౌగిలించుకొని, ఆయనపై ముద్దుల వర్షం కురిపించారు. అంతేగాక, ఇంకొందరు ఔత్సాహిక మహిళలు తమ లోదుస్తులను తీసి పాప్స్టార్పైకి విసిరేశారు.
ఈ నేపథ్యంలోనే, ఇది అత్యంత అనాగరికమైన ప్రవర్తన, తమ సంస్కృతికి విరుద్ధమని దేశాధ్యక్షుడు సిరిసేన మండిపడ్డారు.
అంపారాలోని తూర్పు జిల్లాలో ఆదివారం జరిగిన ఓ బహిరంగసభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. తమ లో దుస్తులను తీసివేసి అనాగరికంగా వ్యవహరించిన మహిళలను దండించాలని తాను కోరడం లేదని, ప్రదర్శన నిర్వాహకులనే విషపూరితమైన కొరడాలతో కొట్టాలని సూచిస్తున్నానని అన్నారు.
కాగా, శ్రీలంకలో మధ్యయుగాల్లో కరుడుగట్టిన నేరగాళ్లను శిక్షించేందుకు విషంపూసిన కొరడాలతో కొట్టేవారు. ఇది ఇలా ఉండగా, ఇగ్లెసియాస్ షో నిర్వహించిన లైవ్ ఈవెంట్స్ సంస్థ భాగస్వాముల్ల్లో శ్రీలంక క్రికెటర్లు కుమార సంగక్కర, మహేల జయవర్ధేనే కూడా ఉండటం గమనార్హం.