9/11 దాడి: లాడెన్కు ప్రేరణగా నిలిచింది ఈ సంఘటనే
జెరూసలెం: అమెరికాలోని ట్విన్ టవర్స్ను ఒసామా బిన్ లాడెన్ కూల్చడానికి పురిగొల్పిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 9/11 పేరుతో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన అమెరికాలోని ట్విన్ టవర్స్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చివేతకు లాడెన్ను పురిగొల్పిన ఘటనపై 'సెప్టెంబర్ 11 ఎటాక్స్ - ద అన్ టోల్డ్ స్టోరీ' అంటూ ఉగ్రవాద సంస్ధ 'ఆల్ మస్రా' పత్రిక ఓ కథనం ప్రచురించింది.
1999లో ఈజిప్టు ఎయిర్ లైన్స్కు చెందిన విమానం 990 లాస్ ఏంజెల్స్ నుంచి కైరోకు ప్రయాణిస్తూ అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయింది. ఈ విమాన ప్రమాద ఘటనలో 217 మంది మృత్యువాతపడగా, అందులో 100 మంది అమెరికన్లు ఉన్నారు. ఈ ఘటనే 9/11కు దాడికి లాడెన్కు స్పూర్తినిచ్చిందని అందులో పేర్కొంది.
విమాన ఇంజిన్ ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఈజిప్టు అధికారులు ఘటన అనంతరం నివేదికలో తేల్చిచెప్పారు. మరోవైపు అమెరికా దర్యాప్తు విభాగం కో పైలట్ జమీల్ ఆల్ బటౌటీ విమానాన్ని ఉద్దేశ్యపూర్వకంగా విమానాన్ని అట్లాంటిక్ మహా సముద్రంలో దించాడని పేర్కొంది.
ఈజిప్టు ఎయిర్లైన్స్ క్రమశిక్షణకు వ్యతిరేకంగా పైలెట్ ఈ దారుణానికి పాల్పడినట్లు తేల్చారు. అయితే ఈ వార్తలను 'ఆల్ మస్రా'లో చదవిన లాడెన్ అనవసరంగా నీట్లో ముంచేశాడని, భవనాన్ని ఎందుకు ఢీ కొట్టలేదని ప్రశ్నించినట్లుగా పేర్కొంది.
ఈ ఘటన తర్వాత ఒసామా బిన్ లాడెన్కు విమానాలతో ట్విన్ టవర్స్ను ఢీ కొట్టాలనే ఆలోచన వచ్చిందని 'ఆల్ మస్రా' వెల్లడించింది. ఆ తర్వాత 9/11 దాడుల వ్యూహకర్త అయిన ఖలీద్ షేక్ మహ్మాద్ తన ఆలోచనను జోడిస్తూ, అమెరికా విమానాలతోనే అమెరికాను దెబ్బతీయాలని పథకం వేశారు. అందులో భాగంగా అమెరికా విమానాలను హైజాక్ చేసి లాడెన్ ఆలోచనను అమలు చేశారని 'ఆల్ మస్రా' వెల్లడించింది.