బిన్ లడెన్, తాలిబన్లు మాకు హీరోలు: ముష్రాఫ్
కరాచి: ఒసామా బిన్ లాడెన్, తాలిబన్లు, లష్కర్-ఏ-తోయిబా తదితర ఉగ్రవాదులను పాకిస్థాన్ ప్రజలు హీరోలుగా భావిస్తారని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముష్రాఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ కు చెందిన ఓ టీవీ చానెల్ కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి వార్తలలో నిలిచారు.
భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్ పూర్తి మద్దతు ఇచ్చిందని అంగీకరించారు. ఈ ఇంటర్వ్యూలో ముష్రాఫ్ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. 1990లో కాశ్మీర్ లో వేర్పాటు వాద కార్యకలాపాలు మొదలయ్యాయని గుర్తు చేశారు.
ఆ సందర్బంలో లష్కర్-ఏ-తోయిబా వంటి 12 ఉగ్రవాద సంస్థలు ఏర్పడ్డాయని అన్నారు. వారికి పాకిస్థాన్ మద్దతు ఇచ్చి కాశ్మీర్ లో పోరాటం చెయ్యడానికి పూర్తి శిక్షణ ఇచ్చి పంపించామని అంగీకరించారు. ఆ సమయంలో హఫీజ్ సయిూద్, లక్వీ ఉంటి ఉగ్రవాదులు ఒక్క సారిగా హీరోలు అయ్యారని అన్నారు.
తరువాత పాకిస్థాన్ లో మతతత్వ పోరాటం ఉగ్రవాదంగా తయారైయ్యిందని, ఇప్పుడు వారు సొంత వారిని చంపేస్తున్నారని, వాటిని నియత్రించాలని పర్వేజ్ ముష్రాఫ్ చెప్పారు. తాలిబన్లకు ఉగ్రవాద శిక్షణ ఇచ్చి రష్యాకు వ్యతిరేకంగా పోరాటం చెయ్యాలని పంపించామని ఇదే సందర్బంలో అన్నారు.
ఒసామా బిన్ లాడెన్, జవహరి, తాలిబన్లు ఒకప్పుడు హీరోలు అయ్యారని, తరువాత రానురాను విలన్లుగా మారారని పర్వేజ్ ముష్రాఫ్ చెప్పారు. మొత్తం మీద భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగడానికి పాకిస్థాన్ పూర్తిగా సహకరించిందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముష్రాఫ్ మీడియా సాక్షిగా స్వయంగా అంగీకరించారు.