ఒసామాబిన్ లాడెన్ కొడుకు హంజా బిన్ లాడెన్ హతం
అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కొడుకు హంజా బిన్ లాడెన్ను అమెరికా మట్టుబెట్టింది. ఈ మేరకు ఆ దేశ ఇంటలిజెన్స్ ప్రకటన విడుదల చేసింది. లాడెన్ హతమైన అనంతరం అతని వారసుడిగా హంజా అల్ ఖైదా చీఫ్ బాధ్యతలు చేపట్టాడు. అతని నేతృత్వంలో అల్ ఖైదా కార్యకలాపాలు కొనసాగుతున్న నేపథ్యంలో హంజా ఆచూకీ చెప్పినా అతన్ని పట్టిచ్చినా భారీ మొత్తాన్ని ఇస్తామని అమెరికా ఫిబ్రవరిలో ప్రకటించింది. మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది.
దాడి నుంచి తప్పించుకున్న హంజా
హంజాను అంతమొందించినట్లు ప్రకటించిన అమెరికా అతన్ని ఎక్కడ మట్టుబెట్టారన్న విషయం మాత్రం వెల్లడించలేదు. ఆ విషయాన్ని రహస్యంగా ఉంచింది. హంజా బిన్ 2018లో చివరిసారి మీడియాకు ఓ వీడియో విడుదల చేశాడు. అందులో సౌదీ అరేబియాను బెదిరించాడు. అక్కడి ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చాడు. లాడెన్కు ఉన్న 2011లో ముగ్గురు భార్యలతో పాకిస్థాన్లోని అబోత్తాబాద్ ఇంట్లో ఉండగా.. అమెరికన్ సీల్స్ దాడి చేసి లాడెన్ను హతమార్చారు. ఈ దాడి నుంచి హంజా బిన్ తప్పించుకోగా.. అతని సోదరుడు ఖాలిద్ను అమెరికన్ సైన్యం మట్టుబెట్టింది.
అమెరికాకు హెచ్చరికలు
బిన్ లాడెన్ భార్యల్లో ఒకరైన సౌదీ అరేబియాకు చెందిన ఖైరియా సబర్కు హంజా జన్మించాడు. ప్రస్తుతం అతని వయసు 29 సంవత్సరాలు. తండ్రి మరణానంతరం అల్ ఖైదా కీలక బాధ్యతలు తీసుకున్నాడు. 2007లో పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్యలో హంజా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అల్ ఖైదా బాధ్యతలు చేపట్టిన అనంతరం 2016 జులైలో హంజా అమెరికాను హెచ్చరిస్తూ ఓ ఆడియో విడుదల చేశాడు. తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు.
అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తింపు
హంజా హెచ్చరికలు, అతని ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. ఆస్తులను బ్లాక్ లిస్టులో పెట్టడంతో పాటు బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసింది. 2016 నుంచి హంజా కోసం అగ్రరాజ్యం వేట కొనసాగిస్తూనే ఉంది. మూడేళ్ల అనంతరం ఎట్టకేలకూ అమెరికా ప్రయత్నం ఫలిచింది. అమెరికా చేసిన దాడిలో హంజా బిన్ లాడెన్ హతమైనట్లుయూఎస్ ఇంటలిజెన్స్ ప్రకటించింది.