21 రోజులే గడువు, దూసుకొస్తున్న చైనా స్పేస్ స్టేషన్, భూమికి ఏం జరుగుతుందో?
బీజింగ్: మరికొన్ని వారాల్లో భూమికి పెద్ద ఉపద్రవం పొంచి ఉంది. చైనాకు చెందిన అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్-1 భూమిని ఢీకొనడానికి సిద్ధమవుతోంది. రెండేళ్ల క్రితం సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ అంతరిక్ష కేంద్రానికి భూమితో సంబంధాలు తెగిపోయాయి. మరో 21 రోజుల్లో ఇది భూమిపై కూలిపోనున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
అంతరిక్షం నుంచి దూసుకొస్తోన్న చైనా స్పేస్ స్టేషన్! దేవుడా.. ఎక్కడ పడుతుందో? ఏం జరుగుతుందో?
ఇది భూమి వైపు దూసుకొస్తున్నప్పటికీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది భూవాతావరణంలోకి ప్రవేశించగానే విచ్ఛిన్నమవుతుందని వారు పేర్కొంటున్నా, ఇందులో హైడ్రాజిన్ ఇంధనం ఉందని, దీనివల్ల తీవ్ర ముప్పు వాటిల్ల వచ్చని తెలుస్తోంది. చివరికి ఏం జరుగుతుందో అనే భయాలు మాత్రం సాధారణ ప్రజానీకాన్ని వీడడం లేదు.
చైనా తొలి అంతరిక్ష పరిశోధనా కేంద్రం...
చైనా తొలి అంతరిక్ష పరిశోధనా కేంద్రం తియాంగాంగ్-1ను 2011లో ప్రయోగించారు. శాశ్వత పరిశోధన కేంద్రంగా ఇది పని చేస్తుందని తొలుత భావించారు. తియాంగాంగ్-1 ఐదు సంవత్సరాలపాటు భూమి చుట్టూ తిరుగుతూ చైనీస్ నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్కు చెందిన మూడు మిషన్లకు బేస్స్టేషన్గా సేవలందించింది. అనంతరం ఈ కేంద్రానికి భూమితో సంబంధాలు తెగిపోయింది. దీని శకలాలు.. జనావాసాలపై కూలితే ప్రాణ, ఆస్తి నష్టం భారీగా ఉంటుందని భావిస్తున్నారు.
ఆసియాలోనే తొలి స్పేస్స్టేషన్...
ఆసియాలోనే తొలి స్పేస్ స్టేషన్గా పేరొందిన తియాంగాంగ్-1ను చైనా అంతరిక్ష రంగంలో తన సత్తా చాటేందుకు ప్రయోగించింది. దీనికి ‘హెవెన్లీ ప్యాలెస్' అని చైనా నామకరణం చేసింది. ఆ తరువాత ఇందులోకి వ్యోమగాములను కూడా పంపింది. చైనాకు చెందిన తొలి మహిళా వ్యోమగామి లియు యంగ్ 2012లో ఈ స్పేస్ స్టేషన్కు చేరుకుంది. కానీ ఐదేళ్లకే సాంకేతిక సమస్యలు ఏర్పడడం వల్ల ఇది ఆశించిన విధంగా సేవలు అందిచలేకపోయింది.
ఇన్నాళ్లూ స్పష్టత లేక...
9.5 టన్నుల బరువున్న ఈ స్పేస్ స్టేషన్లో సెప్టెంబర్ 2016లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అప్పట్నించి భూమితో దీనికి సంబంధాలు తెగిపోయాయి. అనంతరం ఇది తన గమ్యం తప్పి భూమి దిశగా ప్రయాణించసాగింది.
అయితే భూమి వైపు దూసుకొస్తున్న ఈ స్పేస్ స్టేషన్ ఏ ప్రాంతంలో, ఏ సమయంలో పడుతుందనే దానిపై శాస్త్రవేత్తలు ఇన్నాళ్లూ ఓ స్పష్టతకు రాలేకపోయారు.
మార్చి ఆఖర్లో లేదా ఏప్రిల్ మొదటి వారంలో...
మొదటగా చైనా శాస్త్రవేత్తలు ఇది 2017 చివరలో పడుతుందని అంచనా వేశారు. అనంతరం అక్టోబర్ 2017, ఏప్రిల్ 2018 మధ్యలో పడే అవకాశం ఉందన్నారు. అయితే ఇది భూమి వైపు దూసుకొస్తున్నప్పటికీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ జనవరిలో కాలిఫోర్నియాకు చెందిన ఏరోస్పేస్ కార్పొరేషన్.. ఈ ఏడాది మార్చి నెల మధ్యలో ఇది భూమిపై పడుతుందని అంచనా వేసింది.
ఎప్పుడు, ఎక్కడ కూలిపోతుందంటే...
తాజాగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ.. గతి తప్పిన ఈ చైనా స్పేస్ స్టేషన్కు సంబంధించి మరింత కచ్చితమైన సమాచారాన్ని వెల్లడించింది. మార్చి 29, ఏప్రిల్ 9 మధ్య ఉత్తరానికి 43 డిగ్రీలు, దక్షిణానికి 43 డిగ్రీల మధ్య(స్పెయిన్, ఫ్రాన్స్, పోర్చుగల్, గ్రీస్ తదితర ప్రాంతాలు) ఇది భూమిని ఢీకొంటుందని పేర్కొంది. అయితే ఉపగ్రహ శకలాల కారణంగా చరిత్రలో ఇప్పటి వరకూ ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదని, పైగా ఇది భూవాతావరణంలోకి ప్రవేశించగానే విచ్ఛిన్నమవుతుందని, పెద్ద ప్రమాదమేం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
గతంలో ఏం జరిగిందంటే...
1991లో సోవియెట్ యూనియన్కు చెందిన 20 టన్నుల శాల్యూట్ 7 అంతరిక్ష కేంద్రం (స్పేస్ స్టేషన్) కూడా ఇలాగే కూలిపోయింది. అప్పట్లో వాటి శకలాలు అర్జెంటినాలోని పలు ప్రాంతాల్లో పడ్డాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు కూడా. అలాగే 1979లో నాసాకు చెందిన 77 టన్నుల స్కైలాబ్ స్పేస్ స్టేషన్ శకలాలు కూడా ఆస్ట్రేలియాలోని పెర్త్లో పడ్డాయి. ఇప్పుడు తియాంగాంగ్-1 విషయంలో కచ్చితంగా ఫలానా చోట పడవచ్చని చెప్పలేకపోతున్నారు. అది భూమికి దగ్గరగా వచ్చే వరకు ఏ దిశలో ప్రయాణిస్తుందనే విషయంపై స్పష్టత రాదని చెబుతున్నారు.
ఆ ఇంధనంతో ప్రమాదకరమే...
సాధారణంగా అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చే ఉపగ్రహ శకలాలు మధ్య దారిలోనే దగ్ధమైపోతాయి. సముద్రంలో కూలిపోతే మానవళికి ఎలాంటి ప్రమాదం ఉండదుకానీ ఇప్పుడు అంతరిక్షం నుంచి దూసుకొస్తున్న స్పేస్ స్టేషన్ మాత్రం భూమ్మీది నివాస ప్రాంతాలపై కూలవచ్చని చెబుతున్నారు. పైగా తియాంగాంగ్-1 స్పేస్ స్టేషన్లో ప్రమాదకరమైన హైడ్రాజిన్ ఇంధనం ఉందని, దీనివల్ల తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని కొంతమంది శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.