‘రేపు చూస్తామో లేదో’:జపాన్ తీరంలోనే ఓడ, 3700మందిలో 200 మంది భారతీయులు, 6గురికి కరోనా
టోక్యో: జపాన్ సమీపంలో నిలిపివేయబడ్డ విలాసవంతమైన ఓడలో సుమారు 200 మందికిపైగా భారతీయ ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఈ ఓడలో మొత్తం 3700 మంది ఉండగా, వారిలో 64 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో జపాన్ సమీపంలోని యోకోహోమా పోర్టు వద్దనే ఓడను నిలిపివేసి ప్రయాణికులను కూడా అందులోనే ఉంచారు.
కరోనా ఉన్నవారు కూడా ఆ ఓడలోనే..
కాగా, ఈ ఓడలో ఉన్న ఏ భారతీయుడికీ కూడా కరోనా వైరస్ లేదని వైద్య పరీక్షల్లో తేలింది. భయంకరమైన కరోనా వైరస్ ఉన్నవారు కూడా ఓడలేనే ఉండటంతో భారతీయ ప్రయాణికులతోపాటు ఇతరు ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను వెంటనే కాపాడాలని వారు కోరుతున్నారు.
Recommended Video
కాపాడాలంటూ మోడీ, మమతకు విన్నపాలు
ఈ క్రమంలో ఆ ఓడలో ఉన్న పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియా ద్వారా తమను కాపాడాలంటూ సందేశాలు పంపుతుండటం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోడీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు జపాన్ ప్రభుత్వాన్ని సంప్రదించి తమను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ ఉన్న వ్యక్తులను తమ నుంచి వేరు చేయాలని కోరారు.
ఏ భారతీయుడికీ కరోనా వైరస్ లేదు..
చైనాలోని కరోనావైరస్ కేంద్రమైన వూహాన్ నుంచి భారతీయులను రక్షించిన విధంగానే తమను కూడా జపాన్ నుంచి కాపాడాలని మరో 30ఏళ్ల భారతీయ పౌరుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఓడలో ఉన్న ఏ భారతీయునికీ కరోనా వైరస్ లేదని.. కరోనా వైరస్ ఉన్నవారితో ఉండటం వల్ల తమకు కూడా వచ్చే అవకాశం ఉందని.. అందుకే తమను వెంటనే కాపాడాలని కోరారు.
రేపు ఉంటామో ఉండమో..
‘నేను ఇప్పుడు మాట్లాడకపోతే రేపు ఉంటానో ఉండనో తెలియదు' అంటూ అతను సోషల్ మీడియాలో హిందీలో మాట్లాడుతూ ఆవేదనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఈ విషయంపై స్పందించారు. డైమండ్ప్రిన్సెస్ అనే ఓడలో ఉన్న భారతీయులకు కరోనా వైరస్ లేదని తెలిసిందని, భారతీయులను కాపాడే విషయంపై తాము జపాన్ ప్రభుత్వాన్ని సంప్రదించామన్నారు.
280 మందిలో మరో ముగ్గురికి కూడా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని జపాన్ అధికారులు తెలిపారని చెప్పారు. అయితే, వారు ఏ దేశ జాతీయులనే విషయాన్ని చెప్పలేదని, వారిని ఆస్పత్రికి తరలించారన్నారు.
19 వరకు ఓడ అక్కడే..
సోమవారం సాయంత్రం యోకోహాహా తీరానికి 3700 మంది ప్రయాణికులు, సిబ్బందితో వచ్చిన ఆ ఓడ ఇంకా అక్కడేవుండిపోయింది. ఫిబ్రవరి 19 వరకు కూడా మొత్తం ప్రయాణికులను ఓడలోనే నిర్బంధంగా ఉంచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రయాణికులకు కావాల్సిన ఏర్పాట్లను జపాన్ అధికారులు చేస్తున్నారు. ఓడలో కరోనా వైరస్ సోకిన వారి పరిస్థితి విషమంగా ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు.