దుర్ఘటన: మధ్యధరా సముద్రంలో రెండు బోట్లు మునక.. 200 మందికిపైగా దుర్మరణం
లిబియా తీరం సమీపంలో మధ్యధరా సముద్రంలో రెండు బోట్లు మునిగిపోయిన దుర్ఘటనలో 200 మందికిపైగా మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.
ట్రిపోలి: మధ్యధరా సముద్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. లిబియా తీరం సమీపంలో రెండు బోట్లు మునిగిపోయాయి. ఈ దుర్ఘటనలో 200 మందికిపైగా మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు.
స్పెయిన్ కు చెందిన ప్రోయాక్టివా ఓపెన్ ఆర్మ్స్ అనే ఎన్జీవో సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. బోల్తా కొట్టిన రెండు బోట్ల నుంచి సుమారు అయిదు మృతదేహాలను వెలికితీసినట్లు ఆ సంస్థ పేర్కొంది.
ఒక్కొక్క బోటు నుంచి సుమారు వంద మందికిపైగా మరణించినట్లు అంచనా వేస్తున్నారు. ఇటలీ కోస్టు గార్డులు కూడా మృతుల అంశాన్ని ధ్రువీకరించారు. స్మగ్లర్లు తీసుకెళుతున్న బోట్ల నుంచి సుమారు 240 మంది మరణించి ఉంటారని ప్రోయాక్టివా గ్రూప్ నకు చెందిన లారా లాంజ్వా పేర్కొన్నారు.
ఆఫ్రికా దేశాల నుంచి మధ్యధరా సముద్రం మీదుగా ఇటలీ చేరుకుని అక్కడ నుంచి యూరోప్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న శరణార్థుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. టర్కీ నుంచి గ్రీస్ మధ్య ఉన్న మార్గాన్ని పూర్తిగా మూసివేయడంతో అక్రమ వలసదారులు ట్రిపోలి నుంచి యూరోప్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
గత అయిదు రోజుల్లో 40 రెస్క్యూ కార్యక్రమాలు చేపట్టినట్లు ఇటలీ కోస్టు గార్డులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే సుమారు 20 వేల వలసదారులు ఇటలీ చేరుకున్నట్లు అంతర్జాతీయ శరణార్థుల సంస్థ వెల్లడించింది.