ఇండోనేసియాలో భారీ వాల్కనో సునామీ, 222 మంది మృతి: భారీ ఆస్తి, ప్రాణ నష్టం
జకర్తా: ఇండోనేసియాలో సునామీ భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించింది. శనివారం రాత్రి ఇండోనేసియాను సునామీ ముంచెత్తింది. రాత్రి తొమ్మిదిన్నర గంటల తర్వాత పండేగ్లాంగ్, సెరాంగ్, దక్షిణ లాంపంగ్ ప్రాంతాల్లో సంభవించిన సునామీ ధాటికి 222 మంది మృతి చెందారు.
దాదాపు 800 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఇండోనేసియా విపత్తుల నిర్వహణ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇద్దరు తప్పిపోయినట్లు చెప్పారు. పెద్ద సంఖ్యలో బిల్డింగులు దెబ్బతిన్నాయి. నష్టం ఎంత అనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు.
దక్షిణ సుమత్రా, పశ్చిమ జావాలోని బీచ్ల్లో సునామీ వచ్చిందని తెలిపారు. అగ్నిపర్వతం బద్దలవడంతో వాల్కనో సునామీ సంభవించింది. ఈ వాల్కనో సునామీ కారణంగా తొమ్మిది పది హోటల్స్, వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి.
క్రకటోవా అగ్నిపర్వతం పేలుడు సంభవించిన తర్వాత సముద్ర గర్భంలో కొండ చరియలు విరిగిపడి అలజడి చోటుచేసుకోవడమే ఈ సునామీకి కారణమై ఉంటుందని అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలిపారు.