పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్న... 500లకుపైగా భారతీయులు!
500 మందికిపైగా భారతీయులు పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్నారు. వీరిలో అధికశాతం మంది జాలర్లే ఉన్నారు. భారత ఖైదీల్లో చాలామంది అరేబియా మహాసముద్రంలో పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లోకి చేపల వేటకు వెళ్లిన వారే.
లాహోర్ : 500 మందికిపైగా భారతీయులు పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్నారు. వీరిలో అధికశాతం మంది జాలర్లే ఉన్నారు. 527 మంది భారతీయులు సహా మొత్తం 996 మంది విదేశీయులు వివిధ జైళ్లలో ఖైదీలుగా ఉన్నట్టు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ తన నివేదికలో వెల్లడించింది.
దేశంలోకి అక్రమ చొరబాటు, మాదక ద్రవ్యాల రవాణా, హత్యలు, ఉగ్రవాదం తదితర నేరాల ఆరోపణల కింద వీరు ఖైదు చేయబడినట్టు తెలిపింది. భారత ఖైదీల్లో చాలామంది అరేబియా మహాసముద్రంలో పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లోకి చేపల వేటకు వెళ్లి అరెస్టయిన వారే.
అరేబియా సముద్రంలో సరిహద్దులను స్పష్టంగా నిర్దేశించకపోవడం వల్ల తరచూ జాలర్లను అరెస్టు చేయడం, బోట్లను స్వాధీనం చేసుకోవడం పరిపాటిగా మారింది. తమ జలాల్లో అక్రమంగా చేపలవేట కొనసాగిస్తున్నారని ఆరోపిస్తూ గత నెలలో 55 మంది భారత మత్య్సకారులను పాకిస్తాన్ సముద్రయాన రక్షణ సిబ్బంది అరెస్టుచేశారు.
పాక్ జైళ్లలో చైనా, సౌదీ జాతీయులు కూడా ఉన్నారని నివేదిక పేర్కొంది. అంతేకాదు, 100 దేశాల జైళ్లలో 9,476 మంది పాకిస్తాన్ జాతీయులు ఖైదు చేయబడ్డారని సోమవారం లాహోర్ హైకోర్టుకు ఆ దేశ విదేశీ మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. యూఏఈ, సౌదీ అరేబియా, గల్ఫ్దేశాల జైళ్లలో మగ్గుతున్న తమ వారిని విడిపించేందుకు చొరవ చూపాలని బాధిత కుటుంబాలు కోర్టుకు విజ్ఞప్తి చేశాయి.