అదో పెద్ద కథ: ఆదేశంలో పంటలు నిర్ణయించేది మనుషులు కాదు పశువులు..!
థాయ్లాండ్: జ్యోతిష్యం అనేది ఒక్క భారత్కే పరిమితం కాదు. జ్యోతిష్యాన్ని నమ్మేవారు థాయ్లాండ్లో కూడా ఉన్నారు. అందుకే ఆదేశంలో జ్యోతిష్యులకు మంచి గిరాకీ ఉంటుంది. థాయ్లాండ్లో ఈసారి సమృద్ధిగా పంట చేతికి అందుతుందని ఆ దేశంలోని జ్యోతిష్య పండితులు జోస్యం చెప్పారు. అయితే ఇలా ఎలా చెప్పగలిగారు అనేది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
థాయ్లాండ్లో వ్యవసాయ పండగ ప్రారంభం
థాయ్ల్యాండ్లో ఈ మధ్యే కొత్తగా మహా వజిరాలాంగ్కోర్న్ ఆ దేశ రాజుగా పట్టాభిషిక్తుడయ్యారు. ఆయన వ్యక్తిగత రక్షణ సిబ్బందికి కమాండర్గా వ్యవహరించిన సుతిద అనే యువతినే ఆయన వివాహమాడారు. అంతేకాదు ఆమెను దేశానికి మహారాణిగా ప్రకటిస్తూ ఆ దేశ గెజిట్లో కూడా పొందుపర్చారు. ఇక ఆదేశంలో ప్రధాన వ్యవసాయ పండగా ప్రారంభమైంది. ఓ పంట వేసేముందు భూమిని నాగలితో దున్నాల్సి ఉంటుంది. ఇది థాయ్లాండ్లో పెద్ద వేడుకగా పరిగణిస్తారు.
పంటలను డిసైడ్ చేసే తెల్లని జోడెద్దులు
ఈ వేడుకను వీక్షించేందుకు ఆదేశ మహారాజు మహారాణిలు వస్తున్నారంటే ఆ వేడుకకు ఉన్న ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. థాయ్లాండ్ భవిష్యత్తును ఈ వేడుక నిర్ణయిస్తుందనేది అక్కడి ప్రజల భావన. థాయ్లాండ్లో ఆయా సంవత్సరాల్లో పంటలు ఎలా ఉంటాయో తెల్లని రెండు ఎద్దులు నిర్ణయిస్తాయి. ఈ సారి కూడా ఈ రెండు తెల్లని ఎద్దులే పంటలు ఎలా పండుతాయి, రైతులు ఏమేరకు లాభపడతారనే విషయాన్ని చేరవేశాయి. వేడుకను మహారాజు మహావజిరాలాంగ్కోర్న్, మహారాణి సుతిదాలు తిలకిస్తుండగా.... రెండు తెల్లని వృషభాలు పొలంలో కలియతిరిగాయి. డప్పుల శబ్దం నడుమన ఇవి కలియతిరిగాయి. ఈ తంతును ఇద్దరు బ్రాహ్మణులు నిర్వహించారు. వృషభాలు పొలంలో కలియతిరుగుతుండగా అందమైన థాయ్ మహిళలు మల్లెపూలు విసురుకుంటూ ఆ వృషభాల వెంట నడిచారు. 13వ శతాబ్దం నుంచి ఈ వేడుక జరుగుతోంది.
ఈ ఏడాది వరి, గడ్డికే ఓటు వేసిన జోడెద్దులు
ప్రతి సారి ఓ ఏడు ప్రధాన పంటలను ఆ వృషభాల ముందు ఉంచుతారు. ఈ పంటల్లో ఆ వృషభాలు ఏ పంటనైతే తింటాయో ఆ పంట మంచి లాభాలు ఆర్జించిపెడుతుందనే విశ్వాసం థాయ్ ప్రజల్లో ఉంది. ఈ సారి కూడా వరి, మొక్కజొన్న, బీన్స్, నువ్వులు, మద్యం, నీళ్లు, గడ్డిలను వృషభం ముందు ఉంచారు. ఈ సంవత్సరం వృషభాలు వరి, గడ్డిలను తిని నీళ్లు తాగాయని ఆదేశ వ్యవసాయ మరియు సహకార శాఖమంత్రి మీసక్ పక్డీకాంగ్ తెలిపారు. ఈ సారి వర్షాలు కూడా విరివిగా పడుతాయని అదే సమయంలో పంటలు కూడా బాగా పండుతాయని జ్యోతిష్యులు చెప్పారు. ఇక వేడుక ముగియగానే అక్కడి ప్రజలు ఆ వృషభాలు తిన్న వరికోసం ఎగబడ్డారు. పొలాల్లోకి పరుగులు ఆ గింజలను దక్కించుకునేందుకు పోటీపడ్డారు.
బియ్యం ఎగుమతిలో భారత్ తర్వాత థాయ్లాండ్ టాప్
బియ్యం ఎగుమతిలో ప్రపంచదేశాల్లో భారత్ తొలిస్థానంలో ఉండగా థాయ్లాండ్ రెండో స్థానంలో ఉంది. 2018లో థాయ్లాండ్ 5.6 బిలియన్ డాలర్లు మేరా 11మిలియన్ టన్నుల బియ్యంను ఎగుమతి చేసింది. అయితే ఈ ఏడాది భారత్ వియత్నాంల నుంచి బియ్యం ఎగుమతిలో గట్టి పోటీ నెలకొనడంతో థాయ్లాండ్లో 9.5 మిలియన్ టన్నుల బియ్యంను మాత్రమే ఎగుమతి చేయగలుగుతుందని థాయ్ రైస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ తెలిపింది.