పాకిస్తాన్ విమాన ప్రమాదం: ఘటనా స్థలంలో రెండు బ్యాగులు స్వాధీనం..ఏముందో తెలుసా?
కరాచీ: వారం రోజుల క్రితం పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 90కి పైగా ప్రయాణికులు మృతి చెందారు. ఇక ఈ విమాన ప్రమాదంకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగు చూసింది. విమాన ప్రమాదంపై విచారణ చేస్తున్న అధికారులకు ప్రమాద స్థలిలో వివిధ దేశాలకు సంబంధించిన కరెన్సీ దొరికింది. ఇది ఏకంగా 30 మిలియన్ రూపాయలుగా తేలింది.
గత శనివారం లాహోర్ నుంచి కరాచీకి బయలుదేరిన పీకే-8303 విమానం కొద్ది క్షణాల్లో కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుందనగా నివాస ప్రాంతంలో కూలిపోయింది. పైలట్ చివరి నిమిషంలో ఏటీసీతో జరిపిన సంభాషణల ప్రకారం విమానం రెండు ఇంజిన్లు ఫెయిల్ అయ్యాయని తెలుస్తోంది. దీంతో విమానం నివాస ప్రాంతంలో మధ్యాహ్న సమయంలో కూలిపోయింది. ఈ ఘటనలో 97 మంది ప్రయాణికులు మృతి చెందగా ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ఈ ఘటనపై విచారణ చేస్తున్న విచారణాధికారులకు వివిధ దేశాలకు సంబంధించిన కరెన్సీ నోట్లు దొరికాయి. అయితే ఈ నోట్లన్నీ ఒకే బ్యాగులో ఉండటంపై విచారణకు ఆదేశించారు.
అంత పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్లు లాహోర్ విమానాశ్రయంలోని సెక్యూరిటీ చెక్ను దాటుకుని అదే సమయంలో బ్యాగేజ్ స్కానర్లను దాటుకుని విమానంలోకి ఎలా వచ్చాయనేదానిపై విచారణ చేస్తున్నారు. విమాన ప్రమాదంపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో ఘటనా స్థలంలో రెండు బ్యాగులు దొరికాయని ఈ రెండు బ్యాగుల్లో పెద్ద మొత్తంలో క్యాష్ ఉండటాన్ని చూసి షాక్కు గురైనట్లు ఓ విచారణాధికారి చెప్పారు. ప్రస్తుతం గుర్తించిన మృతదేహాలను మృతుల కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోందని విచారణాధికారులు తెలిపారు. అదే సమయంలో వారికి సంబంధించిన లగేజీలు ధ్వంసం కాకుండా ఉంటే వాటిని కూడా అప్పగిస్తున్నట్లు చెప్పారు.
Recommended Video
ఇప్పటి వరకు 47 మృతదేహాలను గుర్తించినట్లు విచారణాధికారులు చెప్పారు. మరో 43 మృతదేహాలు గుర్తుపట్టేనంతగా కాలిపోవడంతో ఆ మృతదేహాలను ఖననం చేసేందుకు పంపించామని చెప్పారు. గత శుక్రవారం జరిగిన విమాన ప్రమాదం పాకిస్తాన్ విమానాయాన చరిత్రలోనే అతి పెద్ద విమాన ప్రమాదం. 2016 డిసెంబర్ 7లో జరిగిన మరో విమాన ప్రమాదంలో 48 మంది మృతి చెందారు.