పాక్ ప్రతీకారం తీర్చుకుంది: గూఢచర్య ముద్ర
ఇస్లామాబాద్: పాకిస్థాన్ భారత్ మీద ప్రతీకారం తీర్చుకుంది. ఇస్లామాబాద్లోని భారత హై కమిషన్లో పని చేస్తున్న ఎనిమిదిమంది అధికారులు ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సభ్యులు అంటూ పాక్ ముద్ర వేసింది.
సందట్లో సడేమియా అంటూ పాక్ మీడియా సైతం భారత అధికారులు గూఢచర్యం చేస్తున్నారని తాటికాయ అంత అక్షరాలతో కథనం ప్రచురించింది. ఢిల్లీలోని పాక్ హై కమిషన్ లో దౌత్యాధికారుల ముసుగులో పాక్ ఐఎస్ఐకి సహకరిస్తున్నారని భారత అధికారులు గుర్తించారు.
పాక్ హైకమిషన్ లో పని చేస్తున్న ఆరు మంది అధికారులు ఐఎస్ఐఎస్ ఏజెంట్లుగా పని చేస్తున్నారని, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఢిల్లీ, ఇంటిలిజెన్స్ అధికారులు సాక్షాలతో సహ ఆధారాలు సేకరించారు.
అందుకు ప్రతీకారంగా పాక్ భారత అధికారుల మీద కక్ష తీర్చుకుంది. ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ లో పని చేస్తున్న 8 మంది అధికారులు ఇండియన్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ సభ్యులని, పాక్ కు వ్యతిరేకంగా విద్రోహ కార్యకలాపాలకు పాల్పుడుతున్నారని ముద్ర వేసింది.
కరాచీ, సింథ్, బలూచిస్థాన్ ప్రాంతాల్లో వీరు ఉగ్రవాద, విద్రోహ, గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. అంతే కాకుండా పాకిస్థాన్-చైనా ఎకనామిక్ కారిడార్ కు వెన్నుపోటు పోడుస్తున్నారని ఆరోపించింది.
పాక్-చైనా దేశాల్లో అస్థిరతకు భారత్ అధికారులు కారణం అవుతున్నారని ఆరోపించింది. ఈ విషయాలను పాకిస్థాన్ విదేశాంగ శాఖ జారీ చేసిన ఉత్తర్వులను ఆ శాఖ అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా మీడియాకు చెప్పారు.
ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ అధికారుల ముసుగులో ఇండియన్ ఇంటిలిజెన్స్ బ్యూరో, ఇంటిలిజెన్స్ బ్యూరో, మీడియా, రా, ఇన్ఫర్మేషన్ విభాగాలకు చెందిన ఈ ఎనిమిది మంది అధికారులు పాక్ లో విద్రోహ, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
అయితే పాక్ చేస్తున్న ఆరోపణలను భారత విదేశాంగ శాఖ ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా మా అధికారులను ఎలా దొంగలను చేస్తారు అని ప్రశ్నించింది. వెంటనే ఇస్లామాబాద్ లో ఉన్న భారత హై కమిషన్ అధికారులను భారత్ కు వచ్చేయాలని ఆదేశించింది.
ఇస్లామాబాద్ లో భారత హై కమిషన్ లో పని చేస్తున్న మా అధికారుల భద్రతను పణంగా పెట్టి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని భారత్ మండిపడింది. గోప్యంగా ఉంచవలసిన భారత అధికారుల పేర్లు, ఫోటోలను మీడియాకు ఇచ్చారని భారత్ ఆరోపించింది.
మా అధికారులు గూఢచర్యం చేస్తున్నారని మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించాలని భారత విదేశాంగ శాఖ అధికారులు డిమాండ్ చేశారు. అయితే పాక్ భారత్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఇలా చేసిందని స్పష్టంగా వెలుగు చూసింది.