భారత్కు ధీటుగా: చైనా నుంచి క్షిపణి వ్యవస్థ కొనుగోలు చేయనున్న పాక్
చైనా: భారత్ రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ఎస్ 400 క్షిపణి వ్యవస్థకు ధీటుగా పాకిస్తాన్ కూడా చైనా నుంచి సూపర్ సానిక్ క్షిపణులను కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇది భారత్ రష్యా దేశాలు సంయుక్తంగా తయారు చేసే బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థకంటే ధీటుగా పనిచేస్తాయని చైనా మీడియా చెప్పుకొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో చైనీస్ హెచ్డీ-1 సూపర్ సోనిక్ క్షిపణికి మంచి డిమాండ్ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఇస్లామాబాద్ కచ్చితంగా ఈ క్షిపణి కొనుగోలు చేసే అవకాశం ఉందని ఇందుకు కారణం ఇది లక్ష్యాన్ని అత్యంత వేగవంతంగా అందుకుని ధ్వంసం చేయగల సత్తా ఈ వ్యవస్థకు ఉందని మీడియా తెలిపింది. చైనీస్ హెచ్డీ-1 సూపర్ సోనిక్ క్షిపణిని చైనాకు చెందిన గ్వాండాంగ్ హోంగ్డా బ్లాస్టింగ్ కంపెనీ తయారు చేస్తోంది. ఈ వ్యవస్థలో క్షిపణి, లాంచ్ ప్యాడ్, కమాండ్ కంట్రోల్, లక్ష్యా చేధన, ఇతర సహకార వ్యవస్థలు ఇమిడి ఉన్నాయి.
ఈ క్షిపణులను ఎయిర్క్రాఫ్ట్లకు, యుద్ధ నౌకలకు కూడా అమర్చవచ్చని పేర్కొంది.ఇక రెండు ప్రభుత్వాలు చర్చలు జరిపిన తర్వాత ఒక అవగాహనకు వచ్చాక క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు సంబంధించి సంతకాలు చేసుకుంటాయని పత్రిక వెల్లడించింది. పాకిస్తాన్తో పాటు మధ్యతూర్పు దేశాలు కూడా క్షిపణి కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇదిలా ఉంటే బ్రహ్మోస్ మిసైల్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికైతే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ మిసైల్గా బ్రహ్మోస్ పేరుగాంచింది. ఇదిలా ఉంటే హెచ్డీ-1 మిస్సైల్ రేంజ్ను మాత్రం వెల్లడించలేదు. బ్రహ్మోస్ మిస్సైల్ రేంజ్ 300 కిలోమీటర్లు.