తనకోపమే తన శతృవు: భారత్పై కోపంతో తనను తాను శిక్షించుకుంటున్న పాక్
కరాచి: జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ఆపై రాష్ట్రాన్ని విభజిస్తూ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ భారత్పై కఠిన ఆంక్షలు విధించింది. భారత్తో వాణిజ్య సంబంధాలు కూడా తెంచుకుంది. ఫలితంగా పాక్లో నివసిస్తున్న సామాన్య ప్రజలకు ఆ దెబ్బ భారీగా తగిలింది. అది కూడా బక్రీద్ పర్వదినంకు ముందు పాకిస్తాన్లో నివసిస్తున్న సామాన్య ప్రజలకు కోలుకోలేని దెబ్బతగిలింది.
పాకిస్తాన్లో ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు
జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజనతో పాకిస్తాన్ కడుపు మండింది. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయో కూడా అంచనా వేయకుండా భారత్తో వాణిజ్య సంబంధాలు తెంచుకుంటూ నిర్ణయం తీసుకుంది. పౌరుషానికి పోయి ఆ దేశ ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది పాక్ ప్రభుత్వం . ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన పాకిస్తాన్.. తాజాగా భారత్తో వాణిజ్య సంబంధాలు తెంచుకుంటూ నిర్ణయం తీసుకొని అక్కడి సామాన్యుడి పొట్ట కొట్టింది. అసలే ముస్లింలు అత్యంత ఘనంగా నిర్వహించుకునే బక్రీద్ పండగకు ముందు కూరగాయల ధరలన్నీ ఆకాశాన్ని తాకడంతో పండగను జరుపుకోలేకపోతున్నట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే రోటీ, నాన్ల ధరలు తారాస్థాయికి చేరడంతో ఆందోళనకు గురవుతున్న ప్రజలు... ఇక టమాటా ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు.
కిలో టమాటా రూ. 300
పాకిస్తాన్లో కిలో టమాటా ధర ఏకంగా రూ.300ను తాకింది. ఇక టమాటాతో పాటు ఇతర కూరగాయలు...బంగాళదుంప, ఉల్లిపాయలు, ఆకుకూరలు ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఈ కూరగాయలన్నీ భారత్ నుంచే పాక్కు దిగుమతి అవుతాయి. ఇప్పుడు భారత్తో వాణిజ్య సంబంధాలు తెంచుకున్న పాకిస్తాన్... నోటికాడి కూడును కూడా ప్రజలకు దూరం చేసినట్లు అయ్యింది. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటడంతో పాకిస్తాన్లోని సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక టమాటా మాట అటుంచితే బంగాళదుంపల ధర కూడా దీని దుంపతెగ అన్నట్లుగా పెరిగాయి. భారత్తో వాణిజ్య సంబంధాలు తెంచుకోకముందు అక్కడ కిలో బంగాళదుంప ధర రూ.10-12 రూపాయలు ఉండగా ఇప్పుడు అది రూ.30 నుంచి 35 రూపాయలకు పెరిగింది.
భారత్ నుంచి పాక్కు టమాటా ఎగుమతి
పాకిస్తాన్కు టమాటా ఎగుమతి ఎక్కువగా భారత్లోని మధ్యప్రదేశ్ నుంచి ఉంటుంది. మధ్యప్రదేశ్లోని మౌర్య, జాబువా, షాజాపూర్, ఖర్గాన్, రత్లం జిల్లాల రైతులు పాకిస్తాన్కు టమాటాలను ఎక్కువగా ఎగుమతి చేస్తుంటారు.ఇవి అమృత్సర్లోని అట్టారీ-వాఘా సరిహద్దు గుండా ఎక్స్పోర్టు ఏజెన్సీ ద్వారా టమాటాలు పాకిస్తాన్కు రవాణా అవుతుంటాయి.అక్టోబర్-నవంబర్లాంటి సీజన్లో టమాటాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఆ సమయంలో 50 నుంచి 60 ట్రక్కుల్లో టమాటాలను సరిహద్దులు దాటిస్తుంటారు. ఇక పుల్వామా దాడుల సమయంలో కూడా పాకిస్తాన్లో టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. మధ్యప్రదేశ్ రైతులు టమాటాలను పాకిస్తాన్కు ఎగుమతి చేయడం నిలిపివేశారు.
మొత్తానికి పాకిస్తాన్ తనకు తానుగా శిక్ష విధించుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తనను తాను కాపాడుకునే క్రమంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ భారత్తో వాణిజ్య సంబంధాలు కట్ చేసుకున్న నేపథ్యంలో ఆ ప్రభావం అక్కడి సామాన్య ప్రజలపై పడుతోంది.