ఎన్నికల వేళ: పాకిస్తాన్లో ప్రధాని ఎవరైనా సరే...పెత్తనం మాత్రం ఆర్మీదే..!
పాకిస్తాన్లో సాధారణ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. రెండు ప్రధాన పార్టీలు ఈ ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి. ఒకటి నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ కాగా మరొకటి మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్త్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ. అయితే ఈ ఎన్నికలను ప్రపంచదేశాలు చాలా ఆసక్తికరంగా తిలకిస్తున్నాయి. ఇక ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తాయో చెప్పేందుకు సర్వేలు తలమునకలై ఉండగా.. రాజకీయ విశ్లేషకులు మాత్రం తమ అభిప్రాయం మరోలా చెబుతున్నారు. ఎవరు గెలిచినా రాజ్యమేలేది మాత్రం అక్కడి ఆర్మీనే అంటూ వారు బల్లచరిచి చెబుతున్నారు.
పాకిస్తాన్ ఎన్నికల్లో ఆ దేశ ఆర్మీ జోక్యం ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో నివసించే మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు, సున్నీ ముస్లింలు, పంజాబీకి చెందినవారంతా పాకిస్తాన్ మిలటరీకి మద్దతు తెలుపుతున్నవారే. అదే ప్రేమను పాక్ ఆర్మీ నుంచి వీరు పొందుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీష్ అతని కుమార్తె పాక్ ఆర్మీపై తమ పోరును కొనసాగిస్తున్నారు. దీంతో పాక్ ఆర్మీకి ప్రత్యామ్నాయంగా పీటీఐ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ మాత్రమే కనిపిస్తున్నారు. పాక్ ఆర్మీ ఇమ్రాన్ ఖాన్కే మద్దతు తెలిపే అవకాశం ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్లో కూడా పలు టీవీ చర్చల్లో ఆ దేశ ఆర్మీ ఎటువైపుందో అనేదానిపై పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది.
పాక్ ప్రభుత్వంలో ఆర్మీ జోక్యం
ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్రభుత్వంలో చాలా సార్లు ఆర్మీ ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. మిలటరీ నియంతలు ఆదేశాన్ని పాలించారు. 1958 -69,1969-1971; 1979-1988; 1999-2007 ఇలా దాదాపు 30 ఏళ్లు పాటు పాక్ను ఆర్మీ నియంతలు పరిపాలించారు. ఇక మిగతా సంవత్సరాలు పరోక్షంగా పాక్ పాలనపై ఆర్మీ తన ముద్రను వేసింది. ఆర్మీ ప్రభుత్వంల జోక్యం చేసుకోవడంతో ఇప్పటి వరకు ఒక పాక్ ప్రధాని ఆదేశాన్ని సంపూర్ణంగా ఐదేళ్లు పాలించిన దాఖలాలు మనకు చరిత్రలో కనపడదు.
గతంలో మిలటరీ నియంతగా ఉన్న జియా ఉల్ హక్ తీసుకొచ్చిన పాకిస్తాన్ రాజ్యాంగ సవరణ 58-2(బి) ద్వారా అధ్యక్షుడు ఆ దేశ పార్లమెంటును కానీ, అసెంబ్లీని కానీ రద్దు చేసే అవకాశముంది. ఈ ఆర్టికల్ను ఆధారంగా చేసుకుని మిలటరీ ఎప్పుడు పడితే అప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేయించేది. ఇదే ఆయుధం 1990లలో బేనజీర్ బుట్టో, నవాజ్ షరీఫ్ల ప్రభుత్వాలకు శరాఘాతంగా మారింది. ఇక 2015లో జర్దారీ ప్రభుత్వం 18వ రాజ్యాంగ సవరణను ఆమోదించింది. ఈ సవరణ ప్రకారం అప్పటి వరకు అధ్యక్షుడి దగ్గరున్న అధికారాలు దేశ ప్రధానికి బదిలీ అయ్యేలా చేసి అక్కడి ప్రజాస్వామ్యం ప్రధాని చేతుల్లో ఉండాలని నిర్ణయం చేసింది. ఇక ఈ రాజ్యాంగ సవరణతో దేశాధ్యక్షుడు ఒక ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశం కోల్పోయారు.
కొత్త చట్టం అమలుతో రంగంలోకి ఐఎస్ఐ
కొత్త చట్టం అమలులోకి రావడంతో మళ్లీ జూలు విదిల్చింది పాక్ ఆర్మీ. వెంటనే ఐఎస్ఐ ఉగ్రవాదులను ప్రేరేపించింది. పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థను మళ్లీ విచ్ఛిన్నం చేసేందుకు ప్రణాళిక సిద్ధంచ చేసింది. పాకిస్తాన్ సుప్రీంకోర్టు కూడా ఈ ట్రాప్లో చిక్కుకుంది. పాకిస్తాన్ నియంతలకు న్యాయ అన్యాయాలతో సంబంధం లేకుండా కోర్టు మద్దతుగా నిలిచింది. ఇందులో భాగంగానే 2017లో నవాజ్ షరీఫ్లో నిజాయితీ లేదంటూ ఆయనపై వేటువేసింది. అంతేకాదు పాకిస్తాన్ చట్టం ప్రకారం ఒక వ్యక్తి నిజాయితీగా ఉండలేని పక్షంలో అతను దేశాన్ని పాలించే అర్హత లేదంటూ పేర్కొని నవాజ్పై వేటువేసింది.
గతంలో పాక్ ఆర్మీ చాలా బలంగా ఉండేది. ప్రభుత్వంలో ఆర్మీ ఏమి చెబితే అది జరిగేది.కానీ ప్రస్తుతం పాక్ ఆర్మీ పరిస్థితి గతంలోలా లేదు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి మద్దతు ఇస్తామా అంటే ఆ పార్టీ మనుగడే కష్టంగా మారింది. దీంతో ఆర్మీ ఇమ్రాన్ఖాన్ పార్టీ వైపు చూస్తోంది.
2013లో షరీఫ్ పై యుద్ధం ప్రకటించిన పాక్ ఆర్మీ
1998లో నవాజ్ షరీఫ్ గద్దెనెక్కగానే పాక్ ఆర్మీ చీఫ్ను డిస్మిస్ చేసే అధికారాలు ప్రభుత్వానికి ఉండాలంటూ కొత్త చట్టం చేశారు. అప్పటి వరకు ఆర్మీ ఛీఫ్లే ప్రధాని ఆ పదవిలో కొనసాగాలా లేదా అని నిర్ణయించేవారు. ఇది ఆర్మీకి మింగుడుపడని విషయం. 1999లో భారత్పై యుద్ధం చేయాలన్న అప్పటి ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ ఏకపక్ష నిర్ణయాన్ని తప్పుబడుతూ ఆ పదవినుంచి తొలగించాలని నవాజ్ షరీఫ్ భావించాడు. అయితే తమ చీఫ్ను ఆర్మీ కాపాడుకోగలిగింది.
ఇక ముషారఫ్ ఓ విమానంలో ప్రయాణిస్తున్నారన్న సంగతి తెలుసుకున్న షరీఫ్ ఆ విమానం పాకిస్తాన్లో ల్యాండ్ అయ్యేందుకు అనుమతి ఇవ్వకూడదని అక్కడి పౌరవిమానాయానా శాఖ అధికారులను ఆదేశించారు. ముషారఫ్ను నవాజ్ షరీఫ్ హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారని పాక్ ఆర్మీ ప్రచారం చేసింది. దీంతో షరీఫ్ ప్రాణానికి ప్రమాదం అని భావించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత అమెరికా బ్రిటన్ దేశాలతో రాజకీయ చర్చలు సఫలమవడం... ఆ రెండు దేశాల జోక్యంతో తిరిగి నవాజ్ షరీఫ్ పాక్ గడ్డపై అడుగుపెట్టి 2013 ఎన్నికల్లో పోటీచేసి అఖండ మెజార్టీతో గెలుపొందారు.
ఎన్నికల ప్రచారంలో నవాజ్ షరీఫ్ మిలటరీ జనరల్స్ పై విరుచుకుపడ్డారు. అసభ్య పదజాలం వారిపై ప్రయోగించారు. అఫ్ఘానిస్తాన్తో సంబంధాలకు చెక్ పెడుతూ భారత్తో సత్సంబంధాలు కొనసాగిస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అంతేకాదు ప్రజాస్వామ్యదేశంలో ప్రజలదే పైచేయి ఉండాలని... ఆర్మీది కాదని తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. అంతేకాదు తన అజ్ఞాతానికి కారణమైన ముషారఫ్ను కటకటాల వెనక్కు పంపుతానని కూడా చెప్పాడు. ఇక నవాజ్ షరీఫ్ పదవిలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పాకిస్తాన్ ఆర్మీ నవాజ్ షరీఫ్ను టార్గెట్ చేసింది.
పాక్ ఆర్మీకి ఆశాజ్యోతిగా ఇమ్రాన్ ఖాన్
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో పాక్ మిలటరీకి ఇమ్రాన్ ఖాన్ మాత్రమే ఆశాజ్యోతిగా కనిపిస్తున్నారు. అందుకే పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీకే తమ మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దశాబ్దాలుగా ఇమ్రాన్ ఖాన్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ... ప్రతి ఎన్నికల్లో ఆయనకు నిరాశే మిగిలింది. అయితే గత కొన్ని నెలలుగా ఇమ్రాన్ఖాన్కు అన్నివిధాలా పాక్ ఆర్మీ అండగా ఉంటూ వస్తోంది. అది ఎంతలా అంటే ఇతర పార్టీలకు చెందిన నేతలను కూడా ఇమ్రాన్ పార్టీలో చేరేలా ప్రలోభాలకు గురిచేసింది. అంతేకాదు పాకిస్తాన్ మీడియాను కూడా తమ అధీనంలోకి తెచ్చుకున్న పాక్ ఆర్మీ... ఇమ్రాన్ పట్ల పాజిటివ్గా ఉండాలని ఆయా టీవీ ఛానెళ్ల యాజమాన్యాలకు హుకూం జారీ చేసింది. నవాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్ఎన్ పార్టీపై అసత్య కథనాలు ప్రసారం చేయాలని ఆదేశించింది. దీంతో నవాజ్ షరీఫ్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలను అరెస్టు చేయడం జరిగింది. కొందరు ఎన్నికల్లో అనర్హులుగా పేర్కొనేలా పాక్ ఆర్మీ చేసింది.
హంగ్ వస్తే ఆర్మీ వ్యూహం ఎలా ఉండనుంది..?
ఆర్మీ నవాజ్ షరీఫ్ పార్టీని అన్ని విధాలా ఇబ్బందులకు గురిచేసినప్పటికీ.. ఈ ఎన్నికలు మాత్రం నువ్వా నేనా అన్నట్లుగానే జరిగే అవకాశం ఉంది. ఆర్మీకి వ్యతిరేకంగా నవాజ్ షరీఫ్ పార్టీకి చాలామంది మద్దతు తెలుపుతున్నారు. ఎవరు ప్రధాని అయినా అది సంకీర్ణ ప్రభుత్వమే అవుతుందనే అంచనాలు వస్తున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకుంటే... ఇక ఆర్మీ మళ్లీ రంగంలోకి దిగి చిన్నా చితకా పార్టీలను ఇమ్రాన్ ఖాన్కు మద్దతు ఇవ్వాల్సిందిగా బెదిరింపులకు దిగే అవకాశం ఉంది. గతంలో ఇలా చాలాసార్లు ఆర్మీ చేసిన దాఖలాలు కనిపిస్తాయి.
పాకిస్తాన్ ఎన్నికలపై ఇంత హైడ్రామా నెలకొంటున్న నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన చివరికి ప్రభుత్వాన్ని నడిపించేది మాత్రం ఆదేశ ఆర్మీనే అని స్పష్టమవుతోంది. ఎవరు ప్రధాని అయినా ఆర్మీని ఢీకొట్టే సత్తా ఇప్పుడైతే లేదనే చెప్పాలి. అందుకే పాకిస్తాన్లో ప్రభుత్వ విజయం అని చెప్పడం కన్నా ఆర్మీ విజయం అని చెప్పడమే ఉత్తమంగా ఉంటుంది.