పాకిస్తాన్పై ఇమ్రాన్ఖాన్ సంచలన వ్యాఖ్యలు..లాడెన్ గురించి ఏమన్నారంటే?
వాషింగ్టన్ : పాకిస్తాన్ కుటిలబుద్ధి మరోసారి అంతర్జాతీయ వేదికపై బట్టబయలైంది. బతికి ఉన్న సమయంలో ఒసామా బిన్ లాడెన్ తమ దేశంలో తలదాచుకున్నట్లు తమకు తెలియదని బుకాయించిన పాక్... స్వయంగా ఆదేశ ప్రధాని ఇమ్రాన్ఖాన్ చేసిన ప్రకటనతో ఉన్న పరువు కాస్త పోయి బజారున పడింది. 2011లో అమెరికా దళాలు లాడెన్ను మట్టుబెట్టాయి. అయితే లాడెన్ తమ దేశంలో లేడని బుకాయించింది పాక్. లాడెన్ తమ దేశంలోనే తలదాచుకుంటున్నట్లు నాటి పాలకులకు తెలుసని ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బాంబు పేల్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఇమ్రాన్ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ అమెరికాకు లాడెన్ సమాచారం ఇచ్చిందని ... ఆ తర్వాతే అమెరికా దళాలు లాడెన్ను మట్టుబెట్టాయని చెప్పారు. అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థకు లాడెన్ ఉన్న ప్రాంతానికి సంబంధించిన డీటెయిల్స్ ఐఎస్ఎఐ పంపిందని చెప్పారు. లాడెన్ను పట్టుకునేందుకు అమెరికా దళాలకు సహకరించిన పాకిస్తాన్ డాక్టర్ షకీల్ ఆఫ్రిదీ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అతన్ని విడుదల చేస్తారా అన్న ప్రశ్నకు ఇమ్రాన్ ఖాన్ పై విధంగా సమాధానం ఇచ్చారు. 2011 మే 2న అమెరికా సైన్యం లాడెన్ను హతమార్చింది. ఆ సమయంలో లాడెన్ అబోటాబాద్లో ఉన్నాడు.
ఇదిలా ఉంటే పాక్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆఫ్రిదీ విడుదలపై ఇమ్రాన్ ఖాన్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ఆఫ్రిదీని విడుదల చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్రాన్ఖాన్ను కోరారు. అయితే అమెరికాకు గూఢచారిగా పనిచేశారనే ఆరోపణలపై ఆఫ్రిదీని అరెస్టు చేయడం జరిగిందని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. అయితే అమెరికాతో తమకు ఎప్పుడు మంచి సంబంధాలు ఉంటాయని తాము భావిస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. అయితే ఒసామా పాకిస్తాన్లోనే ఉన్నాడని అప్పటి పాలకులు గ్రహించి ఉంటే ఆనాడే అతన్ని పట్టుకునేందుకు చర్యలు తీసుకునేవాళ్లమని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఉగ్రవాదంపై పోరు సాగిస్తున్న అమెరికాకు పాకిస్తాన్ సహకరిస్తుందని చెప్పారు. అమెరికాతో భాగస్వామి దేశంగా ఉన్నప్పుడు ఆ దేశం పాకిస్తాన్ను నమ్మలేదని... పాక్ గడ్డపై తలదాచుకున్న వ్యక్తిని మట్టుబెట్టాయని ఖాన్ చెప్పారు. అయితే ఇక పాత కథలను బయటకు తీయదలచుకోలేదని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.