మోడీ మొదలు పెట్టాడు...మేము ముగింపు పలుకుతాం: పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ భారత్ను ఎన్నివిధాలుగా అంతర్జాతీయ సమాజంలో నష్టపరచాలో అన్ని విధాలుగా ప్రయత్నించి చతికిలపడింది. అయినప్పటికీ దాయాది దేశం కడుపు మంట చల్లారలేదు. ప్రతిరోజు ఆ దేశ ప్రభుత్వ నుంచి ఎవరో ఒకరు కశ్మీర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. కశ్మీర్కు తాను అంబాసిడర్గా వ్యవహరిస్తానని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే మరో ప్రకటన పాక్ ప్రభుత్వం నుంచి వెలువడింది.
పాకిస్తాన్ భారత విమానాలకు తమ గగనతలం మూసివేసే యోచనలో ఉన్నట్లుంది. ఇదే విషయంపై పాకిస్తాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవాద్ చౌదరి స్పష్టం చేశారు. పాకిస్తాన్ మీదుగా అఫ్ఘానిస్తాన్కు భారత్ తమ వస్తువులను తరలిస్తుందని భారత్ వాణిజ్యంను దెబ్బ తీసేందుకు పాకిస్తాన్ భూభాగం, గగనతలంను మూసివేసే యోచనలో ఉన్నట్లు మంత్రి ఫవాద్ తెలిపారు.ఇదే విషయాన్ని పాక్ కేబినెట్ భేటీలో చర్చించడం జరిగిందంటూ ట్వీట్ చేశారు. ఇందుకోసం న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా సలహాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మోడీ ప్రారంభించారు పాకిస్తాన్ ముగిస్తుందంటూ ట్వీట్ చేశారు.
ఇప్పటికే భారత్ పాకిస్తాన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. ఢిల్లీలోని తమ దౌత్యాధికారిని వెనక్కు రప్పించిన పాకిస్తాన్.. పాక్లో భారత రాయబారిని కూడా బహిష్కరించింది. ఇప్పటికే కొన్ని భారత విమానాలకు పాకిస్తాన్ గగనతలం మూసివేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే పుల్వామా దాడులు ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో పాకిస్తాన్ తమ గగనతలం మూసివేసింది. జూలై 16వ తేదీన తిరిగి తెరిచింది. బాలాకోట్ దాడుల తర్వాత ఫిబ్రవరి 26వ తేదీన పాకిస్తాన్ గగనతలం మూసివేసింది. అయితే మార్చిలో పాక్షికంగా గగనతలం ఓపెన్ చేసినప్పటికీ... భారత్ విమానాలకు మాత్రం అనుమతి ఇవ్వలేదు.
PM is considering a complete closure of Air Space to India, a complete ban on use of Pakistan Land routes for Indian trade to Afghanistan was also suggested in cabinet meeting,legal formalities for these decisions are under consideration... #Modi has started we ll finish!
— Ch Fawad Hussain (@fawadchaudhry) August 27, 2019