భారత్ పై పాక్ ప్రధాని పిచ్చి కూతలు..పుల్వామా తరహా దాడులు కావాలా? అంటూ బెదిరింపులు
ఇస్లామాబాద్: జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి హోదా గల రాష్ట్రంగా గుర్తించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంపై పాకిస్తాన్ కడుపు మండుతోంది. కాశ్మీర్ గడ్డపై తమ పప్పులు ఉడకవని భావిస్తోన్న పాకిస్తాన్ ప్రభుత్వం.. ఉగ్రవాాదాన్ని మరింత ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేస్తోంది. స్వయంగా ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నోటి నుంచే ఇలాంటి సంచలన వ్యాఖ్యలు రావడం ఆశ్చర్యపరుస్తోంది. ఆర్టికల్ 370ని రద్దు చేయడం, జమ్మూ కాశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం వల్ల భారత్, పాకిస్తాన్ మధ్య భవిష్యత్తులో సంప్రదాయక బద్ధమైన యుద్ధం నెలకొనే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. సంప్రదాయక యుద్ధం అంటే.. ఉగ్రవాద దాడులేనని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.
కాసేపట్లో లోక్ సభ ముందుకు కాశ్మీర్ విభజన బిల్లు..విస్తృత చర్చ: గెలుపు లాంఛనమే?
ఉగ్రవాదులకు ఊతం
ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన తీర్మానం లోక్ సభ ఆమోదం పొందడం పాకిస్తాన్ లో రాజకీయ ప్రకంపనలను పుట్టించింది. ఇమ్రాన్ ఖాన్ పార్లమెంట్ ను సమావేశ పరిచారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కాశ్మీర్ అంశాన్ని పరిష్కరించాల్సింది పోయి.. మరింత జటిలం చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే తమ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడానికి ప్రధాన కారణమైన జమ్మూ కాశ్మీర్ జ్వాలలపై పెట్రోల్ పోస్తోందని ధ్వజమెత్తారు. ఆర్టికల్ 370 రద్దుపై తాము ఐక్యరాజ్య సమితిలో తేల్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. పుల్వామా తరహా ఉగ్రవాదుల దాడులు మరిన్ని చోటు చేసుకుంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానంచారు. భారత్ తీసుకున్న తాజా నిర్ణయం జమ్మూ కాశ్మీర్ ను మరింత సమస్యల్లోకి నెట్టేలా ఉందని, ఉగ్రవాదుల దాడులకు పరోక్షంగా ప్రోత్సహించినట్టు ఉందని అన్నారు.
ఆజాద్ కాశ్మీర్ లో సమస్యలు..
ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పాక్ ఆక్రమిత్ కాశ్మీర్ లో మరిన్ని సమస్యలను సృష్టిస్తుందని చెప్పారు. దీన్ని ఎదుర్కొనడానికి ఆజాద్ కాశ్మీర్ సిద్ధంగా ఉండాలని చెప్పారు. భారత్ ఆజాద్ కాశ్మీర్ పై దాడులకు పూనుకుంటే.. తాము తిప్పి కొడతామని, మరిన్ని దాడులు చేస్తామని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు. తమ వద్ద అణుబాంబులు ఉన్నాయనే విషయాన్ని భారత్ విస్మరించకూడదని చెప్పారు. యుద్ధమే అంటూ జరిగితే.. రెండు దేశాలు పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఆ పరిస్థితిని కొని తెచ్చుకోవద్దని సూచించారు. యుద్ధం వస్తే.. చివరి రక్తపు బొట్టు వరకూ పోరాడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ వద్ద అత్యాధునిక సైనిక ఆయుధాలు ఉన్నాయని అన్నారు.
ముస్లింలు మెజారిటీ సంఖ్యలో ఉన్న పాక్ పై కక్ష
ముస్లింలు మెజారిటీ సంఖ్యలో ఉన్న జమ్మూ కాశ్మీర్ పై భారత ప్రభుత్వం కత్తి కట్టిందని అన్నారు. ముస్లింలను తరిమేయాలని భావిస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. జాత్యహంకార విధానాన్ని భారత్ ప్రోత్సహిస్తోందని, ఇతర రాష్ట్రాల్లో దీన్ని అమలు చేయాలనుకుంటే.. తమకు అభ్యంతరం లేదని, జమ్మూ కాశ్మీర్ విషయంలో అలాంటి పొరపాట్లు చేయొద్దని ఆయన భారత ప్రభుత్వానికి సూచించారు. తన జాత్యహంకార భావాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం.. జమ్మూ కాశ్మీర్ పై రుద్దుతోందని మండిపడ్డారు. భారత ప్రభుత్వం.. ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశాలు, సిమ్లా ఒప్పందం, ఐక్యరాజ్య సమితి తీర్మానాలను విస్మరించిందని ఆరోపించారు. జెనీవా తీర్మానాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని, దీన్ని యుద్ధ నేరంగా ఆయన అభివర్ణించారు. ఎలాంటి సవాల్ ఎదురైనప్పటికీ..ధీటుగా తిప్పికొట్టడానికి తాము, తమ సైన్యం సదా సిద్ధంగా ఉందని అన్నారు.
పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి..
జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి హోదా గల రాష్ట్రంగా గుర్తిస్తూ రూపొందించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో పాటు ఎకాఎకిన ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించడం, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తూ హోం శాఖ మంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ తీర్మానాన్ని సభ ఆమోదించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఓ గెజిట్ సైతం అప్పటికప్పుడు జారీ చేశారు. అనూహ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం యావత్ దేశాన్ని క్షణంపాటు నివ్వెరపోయేలా చేసింది. మోడీ తీసుకున్న సాహసోపేత నిర్ణయంగా దీన్ని అభివర్ణించారు ప్రజలు. రాజకీయాలకు అతీతంగా ప్రత్యర్థి పార్టీల నాయకులు సైతం ఈ చర్యను స్వాగతించారు.