నేపాల్ ప్రధాని ఓలీకి అండగా ఇమ్రాన్ ఖాన్.. ఇది జిన్పింగ్ స్కెచ్చేనా..?
కొన్ని దశాబ్దాలుగా భారత్ -నేపాల్ దేశాల మధ్య మంచి మైత్రి ఉంది. ఎంతోమంది నేపాల్ ప్రధానులు భారత్తో మంచి సంబంధాలు నడిపారు. అప్పటి వరకు ఎప్పుడూ లేని సరిహద్దు సమస్య ప్రస్తుత నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతో వచ్చింది. భారత్ నేపాల్ భూభాగాన్ని ఆక్రమించిందంటూ కొత్త రాగం అందుకున్నారు. అంతేకాదు తమ పటంలో కూడా భారత భూభాగాన్ని చేరుస్తూ పార్లమెంటులో బిల్లు తీసుకొచ్చి దానికి చట్టబద్ధత కల్పించారు. దీనిపై సర్వత్రా విమర్శలు ఎదొర్కొన్నారు. అయితే దీని వెనక చైనా కథ నడిపిందనే వార్తలు కూడా వచ్చాయి. చైనా చేతిలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ కీలుబొమ్మగా మారారని అక్కడి ప్రధాన ప్రతిపక్షం సైతం విమర్శించింది. ఇక సొంత పార్టీ అంటే నేపాల్ కమ్యూనిస్టు పార్టీలోనే ప్రధాని రేపీ శర్మ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
సొంత పార్టీ నేతలే తనను అధికారం నుంచి దించివేయాలని చూస్తున్నారంటూ ఆదివారం నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కుట్రలో భారత్తో పాటు పలు నేపాల్ కమ్యూనిస్టు పార్టీ నేతలు ఉన్నారని ఆయన ఆరోపించారు. అంతేకాదు కొత్త నేపాల్ మ్యాప్ను కూడా విడుదల కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. భారత్ కుట్ర ఉందనే ఆరోపణలు చేయడంతో సొంత పార్టీ వారే ఓలీకి ఎదురు ప్రశ్నలు వేశారు. పార్టీ మరియు ప్రభుత్వంలో తన పదవికి రాజీనామా చేయాలని పుష్ప కమల్ దహాల్ ప్రచండ డిమాండ్ చేశారు. అంతకుముందు ఓలీకి రెండు పదవుల్లో ఏదో ఒక పదవిలో ఉండేందుకు అనుమతిచ్చారు. అయితే పార్టీలో లేదా ప్రభుత్వంలో ఒక పదవిలో ఉండాలని కోరారు.
ఇక పార్టీలో ఒంటరివాడవటంతో ఓలీకి ఇప్పటి వరకు చైనా మద్దతుగా నిలువగా తాజాగా చైనా మిత్రదేశం భారత్కు చిరకాల శతృవుగా మిగిలిపోయిన పాకిస్తాన్ మద్దతుగా నిలిచింది. అధికారంలో ఉండేందుకు ఓలీ నానా కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ఓలీకి అండగా నిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని ఓలీతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోన్లో మాట్లాడాలని భావిస్తున్నారని ఇందుకోసం సమయం ఫిక్స్ చేయాలని కోరుతూ పాక్ ప్రభుత్వం నుంచి నేపాల్ విదేశాంగ శాఖకు లేఖ వెళ్లింది. అయితే గురువారం రోజున మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఇమ్రాన్ఖాన్ నేపాల్ ప్రధానితో మాట్లాడేందుకు సుముఖంగా ఉన్నట్లు లేఖలో పాక్ ప్రభుత్వం పేర్కొంది. సమాధానం కోసం ఎదురుచూస్తూ ఉంటామని పేర్కొంది. అయితే వీరిరువురూ భారత్పైనే చర్చించనున్నట్లు సమాచారం.
ఇక సోమవారం పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్పై జరిగిన బాంబు దాడి వెనక భారత్ హస్తం ఉందని పాక్ ఆరోపించింది. ఇదే సమయంలో తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారత్ యత్నిస్తోందంటూ నేపాల్ ప్రధాని కూడా ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇద్దరు ప్రధానుల మధ్య భారత్ అంశమే చర్చకు రానున్నట్లు సమాచారం. ఇక రెండు దేశాలు అంటే పాకిస్తాన్ నేపాల్ దేశాల్లో చైనా పలు ప్రాజెక్టులు చేపడతున్న కారణంగా ఈ రెండు దేశ ప్రధానులు డ్రాగన్ కంట్రీకి దాసోహం అయ్యారని పలువురు అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.