పాక్కు చెప్పి చూశాం వినలేదు ..ఇప్పుడు అనుభవిస్తోంది: సర్జికల్ స్ట్రైక్స్ పై చైనాలో సుష్మా
చైనా: పుల్వామా ఉగ్రదాడుల తర్వాత భారత్ పాక్ పై చేసిన సర్జికల్ స్ట్రైక్స్ 2 సమర్థించుకున్నారు విదేశాంగా మంత్రి సుష్మా స్వరాజ్. ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న ఆమె చైనా విదేశాంగా మంత్రి వాంగ్ యి వుజెన్తో సమావేశమయ్యారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె చైనాను కోరారు. రష్యా ఇండియా చైనా సమావేశంలో పాల్గొనేందుకు సుష్మా స్వరాజ్ బుధవారం చైనాకు చేరుకున్నారు.మూడుదేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించేందుకు అన్ని దేశాలు ముందుకు రావాలన్నారు.
"పుల్వామా ఉగ్రదాడుల గురించి మీ కందరికి తెలిసే ఉంటుంది. జైషే మహ్మద్ సంస్థ 40 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. ఈ సంస్థపై ఐక్యరాజ్య సమితి దృష్టి కూడా ఉంది" అని సుష్మా అన్నారు. జైషే మహ్మద్ పై పాక్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సుష్మా సమావేశంలో మండిపడ్డారు. ప్రపంచదేశాలు కోరినప్పటికీ వారి మాటను పెడిచెవిన పాక్ పెట్టిందని ధ్వజమెత్తారు. జైషే మహ్మద్ సంస్థ దాడి చేసిందని తెలిసి కూడా దాడులు పాక్కు సంబంధంలేదని చెప్పడం పాకిస్తాన్ సిగ్గుపడాల్సిన విషయం అని సుష్మా అన్నారు. అందుకే భారత్ చర్యలకు దిగి ప్రతీకారం తీర్చుకుందని అన్నారు.
ఇక దేశవ్యాప్తంగా మరిన్ని ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో అవి జరగకుండా ముందుగానే పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దాడి చేసిందని వెల్లడించారు. అయితే సాధారణ ప్రజలకు ఎలాంటి ప్రాణహాని కలగకుండా దాడుల సమయంలో జాగ్రత్తలు పాటించామని సుష్మా చెప్పారు.
ఇక ప్రధాని మోడీ చైనాలో అనధికారిక పర్యటన చేసినప్పటి నుంచి భారత్ చైనాల మధ్య మంచి సంబంధాలు నెలకొన్నాయని సుష్మా చెప్పారు. రెండు దేశాలకు మంచి సంబంధాలు కొనసాగించడం ఎంతో అవసరమని వెల్లడించారు. అంతేకాదు భారతదేశమంతా కన్నీరు పెడుతున్న సమయంలో తాను చైనా పర్యటన చేస్తున్నట్లు చెప్పిన సుష్మా స్వరాజ్... పుల్వామాలో ఇదే అతిపెద్ద ఉగ్రదాడి అని ఆవేదన వ్యక్తం చేశారు.