పాకిస్తాన్ మరో దుర్మార్గం: ఆ రెండు ఉగ్రవాద సంస్థలపై నిషేధం లేదు.. నిఘా మాత్రమే
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మరోసారి మోసానికి తెగబడింది. దుర్మార్గపు చర్యకు పూనుకుంది. 26/11 నాటి ముంబై దాడులకు సూత్రధారి హఫీజ్ సయీద్ కు చెందిన జమాత్-ఉద్-దవాతో పాటు ఫలా-ఇ-ఇన్సానియత్ ఉగ్రవాద సంస్థలను నిషేధించినట్లు ఇదివరకు ప్రకటించిన పాకిస్తాన్.. యూ టర్న్ తీసుకుంది. ఈ రెండు సంస్థలపై నిషేధాన్ని విధించలేదు. వాటిపై నిఘా మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.
దీనికి సంబంధించి.. పాకిస్తాన్ హోమ్ మంత్రిత్వశాఖ ఆధీనంలో ఉన్న జాతీయ ఉగ్రవాద వ్యతిరేక అథారిటీ సోమవారం ఓ ప్రకటన జారీ చేసింది. దేశంలో క్రియాశీలకంగా ఉన్న 68 ఉగ్రవాద సంబంధ సంస్థలపై నిషేధాన్ని విధించినట్లు పాకిస్తాన్ ఈ ప్రకటనలో వెల్లడించింది. జమాత్-ఉద్-దవాతో పాటు ఫల-ఇ-ఇన్సానియత్ లపై నిఘా మాత్రమే ఉంచినట్లు పేర్కొంది.
జమాత్-ఉద్-దవా సంస్థకు కరడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ చీఫ్ గా వ్యవహరిస్తున్నాడు. కసబ్ సహా ఉగ్రమూకలను ముంబైకి ఉసి గొల్పిన ఘటనలో హఫీజ్ సయీద్ ప్రధాన సూత్రధారి. ముంబైపై ఉగ్రవాదులు చేసిన దాడికి వ్యూహాన్ని పన్నింది హఫీజ్ సయీదేనని అప్పట్లో పాకిస్తాన్ ప్రభుత్వం కూడా వెల్లడించింది. ఆ సంస్థతో పాటు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న ఫలా-ఇ-ఇన్సానియత్ ను కూడా నిషేధిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం..వెల్లడించింది. దీనిపై కిందటి నెల 28వ తేదీన అధికారికంగా ఓ ప్రకటన కూడా వెలువడించింది.
తాజాగా ఆ దేశ జాతీయ ఉగ్రవాద వ్యతిరేక అథారిటీ జారీ చేసిన నిషేధ జాబితాలో ఈ రెండు సంస్థలు పేర్లు లేవు. జైషె మహమ్మద్, లష్కరే తోయిబా, అల్ ఖైదా, తెహ్రీక్-ఇ-తాలిబాన్ సహా 68 ఉగ్రవాద సంస్థలను నిషేధిస్తున్నట్లు ప్రకటించిన కాలమ్ లో ఈ రెండింటి పేర్లను చేర్చలేదు. నిఘా ఉంచాల్సిన సంస్థల జాబితాలో వాటిని చేర్చింది. కిందటి నెల 21వ తేదీన ఈ జాబితాను జారీ చేసింది పాకిస్తాన్. దీనితో మరోసారి ఆ దేశం మోసానికి పాల్పడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.