భారత్కు వ్యతిరేకంగానే: కుల్భూషణ్ జాదవ్ మరణశిక్షపై అమెరికా నిపుణులు
భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్కు పాకిస్థాన్ మరణశిక్ష విధించడంపై అమెరికా నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రపంచ దేశాల్లో పాక్ను ఒంటరి చేయాలని ప్రయత్నిస్తున్న భారత్కు
వాషింగ్టన్: భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్కు పాకిస్థాన్ మరణశిక్ష విధించడంపై అమెరికా నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రపంచ దేశాల్లో పాక్ను ఒంటరి చేయాలని ప్రయత్నిస్తున్న భారత్కు వ్యతిరేకంగా గట్టి సందేశం పంపేందుకే పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని వారు అభిప్రాయపడ్డారు.
కులభూషణ్ జాదవ్(46)పై పాక్ గూఢచర్యం ఆరోపణలు మోపడంతో పాటు బలూచిస్థాన్, కరాచీలో విద్రోహచర్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. పాక్ సైనిక కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. కులభూషణ్ శిక్షపై పాక్ చెబుతున్న కారణాలు బలహీనంగా ఉన్నాయని అమెరికాలోని సౌత్ ఏషియన్ సెంటర్ ఎట్ ద అట్లాంటిక్ కౌన్సిల్ డైరెక్టర్ భరత్ గోపాలస్వామి అభిప్రాయపడ్డారు.
సరైన ఆధారాలు చూపించకుండానే శిక్ష విధించడం రాజకీయ కారణాల వల్లే అని అనిపిస్తోందని అన్నారు. భారత్- పాకిస్థాన్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని, ఈ పరిణామంతో ఇరు దేశాలు మున్ముందు ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావొచ్చని ప్రతిష్ఠాత్మక వుడ్రో విల్సన్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ మైకేల్ కుగెల్మన్ పేర్కొన్నారు. జాదవ్ కేసుకు సంబంధించి రహస్య విచారణ, నెలకొన్న అనిశ్చితిపై అనుమానం వ్యక్తం చేశారు.
యాదవ్ను అడ్డం పట్టుకుని భారత్ నుంచి పాక్ పలు ప్రయోజనాలను ఆశిస్తున్నట్లు తెలుస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు. పాక్ చర్యపై పలువురు నిపుణులు రకరకాల అనుమానాలను, ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్, అధ్యక్ష నివాసం వైట్హౌస్ మాత్రం ఈ ఘటనపై స్పందించడానికి నిరాకరించాయి. దీనికి సంబంధించి రిపోర్ట్స్ చూశామని, ఇతర వివరాల కోసం భారత్, పాకిస్థాన్ ప్రభుత్వాలను సంప్రదిస్తామని స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి తెలిపారు.