ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి వల్ల మా చెట్లు కూలిపోయాయి, ఐరాసకు ఫిర్యాదు చేస్తాం: పాక్
ఇస్లామాబాద్: గత నెలలో (ఫిబ్రవరి) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తమ భూభాగంలోకి వచ్చి బాంబులు వేసి ప్రకృతిని నాశనం చేసిందని పాకిస్తాన్ మరో కొత్త పాట పాడుతోంది. ఈ మేరకు ఐక్య రాజ్య సమితిలో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడుల వల్ల చెట్లు కూలిపోయాయని చెబుతోంది.
అడవిలో ఉన్న చెట్లు కూలిపోయి పర్యావరణానికి తీవ్ర నష్టం
భారత్ వైమానిక దళం వేసిన బాంబుల కారణంగా తమ దేశంలోని అడవిలో ఉన్న చెట్లు కూలిపోయి పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లిందని పాకిస్థాన్ మంత్రి మాలిక్ అమిన్ అస్లాం శుక్రవారం ఆరోపించారు. దీనిపై ఐక్య రాజ్య సమితిలో భారత్పై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తమ అటవీ ప్రాంతంలో భారత్ వైమానిక దళాలు బాంబులు జారవిడిచాయని, దీని వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.
పైన్ చెట్లు చాలా కూలిపోయాయి
అడవిలో ఉన్న పైన్ చెట్లు చాలా కూలిపోయాయని, పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడ్డాయని పాకిస్తాన్ పర్యావరణ శాఖ మంత్రి తెలిపారు. భారత్ దాడి చేసినట్లుగా చెబుతున్న ప్రాంతాలను పరిశీలించేందుకు పాకిస్తాన్ అంతర్జాతీయ మీడియా ప్రతినిధులను ఆహ్వానించింది. ఇద్దరు రాయిటర్స్ రిపోర్టర్లు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ నాలుగు పెద్ద పెద్ద గుంతలు, పదిహేను పైన్ చెట్లు కూలిపోయినట్లు కనిపించాయట.
బాంబుల వర్షం వల్ల
భారత్ బాంబులు వేయడం వల్ల తమ అటవీ ప్రాంతం దెబ్బతిందని పాక్ మంత్రి అస్లాం అంటున్నారు. ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ప్రకారం పర్యావరణానికి హాని కలిగించడం అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించడం కిందకు వస్తుందన్నారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాక్లోని జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.