పుల్వామా దాడి పాకిస్థాన్ విజయం: భారత్పై జాతీయ అసెంబ్లీలో పాక్ దేశ మంత్రి అక్కసు
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పాకిస్థాన్ అసలు రూపం మరోసారి బయటపెట్టుకుంది. జమ్మూకాశ్మీర్లోని పుల్వామాలో దాడి చేసింది తామేనంటూ గొప్పలు చెప్పుకుంది. ఇది పాకిస్థాన్ ప్రజల విజయమని, ఇమ్రాన్ ఖాన్ గొప్ప ఘనత అని ఆ దేశ మంత్రి ఫవద్ చౌదురి గురువారం పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయన పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మాట్లాడారు. భారత్ను వారి గడ్డపైనే దెబ్బకొట్టామని, పుల్వామాలో విజయం సాధించామని అన్నారు. ఇది ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో పాక్ సాధించిన విజయమని అభివర్ణించారు. పాక్ ప్రజలంతా ఆ విజయంలో భాగస్వాములని భారత్పై అక్కసును చాటుకున్నారు. అయితే, ఆ తర్వాత ఫవద్ మాట మార్చారు. తాను అలా అనలేదని, భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలు తమకెంతో కీలకమని వ్యాఖ్యానించారు.
భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ వ్యవహారంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ బజ్వా భయంతో వణికిపోయినట్లు ఆ దేశ ప్రతిపక్ష ఎంపీ అయాజ్ సాధిక్ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మంత్రి ఫవద్ ఈ మేరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
పుల్వామా దాడి ఘటన అనంతరం పాక్ యుద్ధ విమానాలను తరముతూ వెళ్లిన భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్.. విమానం కుప్పకూలడంతో పాక్ సైన్యానికి చిక్కిన విషయం తెలిసిందే. ఆయన విడుదల వ్యవహారంలో జరిగిన పరిణామాలను పాకిస్థాన్ ముస్లింలీగ్(ఎన్)నేత అయాజ్ సాధిక్ వివరించారు.
అభినందన్ విడుదల వ్యవహారంలో పాక్ ఆర్మీ చీఫ్ బజ్వా, విదేశాంగ మంత్రి ఖురేషీకి మధ్య జరిగిన సంభాషణను సాధిక్ పార్లమెంటులో ప్రస్తావిస్తూ.. అభినందన్ వర్థమాన్ను విడుదల చేయకపోతే భారత్ తమ దేశంపై దాడులు చేసేందుకు సిద్ధంగా ఉందని ఖురేషి చెప్పినట్లు.. ఆ సమయంలో బజ్వా కాళ్లు వణికినట్లు ఆయాజ్ వెల్లడించారు. కాగా, 2019, ఫిబ్రవరి 14న పుల్వామా దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది అమరులైన విషయం తెలిసిందే.