భారత్-పాక్ కాల్పుల విరమణ- ఇమ్రాన్ ఖాన్ మాస్టర్ ప్లాన్- సైనిక పాలన తప్పించే యత్నం ?
దాయాది దేశాలైన భారత్-పాకిస్తాన్ మధ్య మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. గతవారం ఇరుదేశాల సైనికాధికారులు కాల్పుల విరమణపై సంయుక్త ప్రకటన చేశారు. బాలాకోట్ దాడుల తర్వాత గతంలో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కనబెట్టిన ఇరుదేశాలూ ఇప్పుడు ఆకస్మికంగా కాల్పుల విరమణకు సిద్ధం కావడం వెనుక గల కారణాలపై అంతర్జాతీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే భారత్ ప్రతిపాదించిన కాల్పుల విరమణకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకరించడం వ్యూహాత్మకమా లేక సైనిక పాలన భయమా అన్న అంశంపైనే ఎక్కువగా చర్చ సాగుతోంది.
భారత్-పాక్ కాల్పుల విరమణ
భారత్-పాకిస్తాన్ మధ్య సరిహద్దు వివాదాలకు దశాబ్దాల చరిత్ర ఉంది. భారత భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించి తమ దేశంలో కలుపుకోవడంపై ఇప్పటికీ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం భారత్ను నిత్యం ఇబ్బందిపెడుతూనే ఉంది. అయితే మధ్యమధ్యలో మాత్రం కాల్పుల విరమణ పేరుతో ఇరుదేశాలూ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నాయి. రెండేళ్ల క్రితం బాలాకోట్ ఘటన తర్వాత భారత్-పాక్ మధ్య పరిస్దితి మరోసారి ఉప్పూనిప్పుగా మారిపోయింది. అయితే తాజాగా ఇరుదేశాలూ మరోసారి ఆకస్మికంగా కాల్పుల విరమణకు సిద్ధమయ్యాయి. దీంతో ఈ వ్యవహారం వెనుక ఉన్న కారణాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఇమ్రాన్ ఖాన్, సైన్యం మధ్య పోరు
పాకిస్తాన్లో ప్రధానిగా పగ్గాలు చేపట్టిన కొత్తలో ఆర్మీతో సత్సంబందాలు నడిపిన ఇమ్రాన్ ఖాన్ ఆ తర్వాత విపక్షాల ఒత్తిడితో ఆర్మీకి క్రమంగా దూరమవుతున్న పరిస్ధితులు కనిపిస్తున్నాయి. మరోవైపు కరోనాతో కుదేలైన ఆర్ధిక వ్యవస్ధ, విచ్చలవిడిగా వ్యాప్తిస్తున్న తీవ్రవాదం వంటి అంశాలు ఇమ్రాన్కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దీంతో బలహీన ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్పై ముద్ర పడుతోంది. దీన్ని ఆసరాగా తీసుకుని తన ప్రభుత్వాన్ని ఆర్మీ ఎక్కడ కుప్పకూలుస్తుందో తెలియక ఇమ్రాన్ భయంభయంగా గడుపుతున్నారు. అదే జరిగితే గతంలో జరిగిన పరిణామాలు రిపీట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
ముషారఫ్ బాటలోనే జనరల్ బజ్వా
గతంలో అప్పట్లో ప్రధానిగా ఉన్న నవాజ్ షరీఫ్ను కూలదోసి దేశ పాలనను తన చెప్పుచేతల్లోకి తీసుకున్న సైన్యాధిపతి జనరల్ పర్వేజ్ ముషారఫ్.. కొన్నేళ్లపాటు పాక్కు తిరుగులేని నేతగా చెలామణి అయ్యారు. రాజకీయ పక్షాలను కాదని తన హవా కొనసాగించారు. చివరికి ప్రజా ఉద్యమాలతో తిరిగి ఎన్నికలు జరిగి నవాజ్ షరీఫ్ కొలువుదీరినా అవినీతి ఆరోపణలతో ఆయన పదవి వదులు కోవాల్సి వచ్చింది. ఆయన తర్వాత జరిగిన ఎన్నికల్లో పగ్గాలు చేపట్టిన ఇమ్రాన్ ఖాన్ మొదట్లో సైన్యాధిపతి జనరల్ కమర్ బజ్వాతో సఖ్యతగా ఉన్నా సైన్యం కోరుకున్నట్లుగా పాలన లేకపోవడంతో ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ముషారఫ్ తరహాలోనే బజ్వా కూడా తన ప్రభుత్వాన్ని కూలదోస్తాడన్న భయం ఇమ్రాన్ఖాన్ను వెంటాడుతోంది.
కాల్పుల విమరణ వెనుక ఇమ్రాన్ మాస్టర్ ప్లాన్ ఇదే
ప్రస్తుతం పాకిస్తాన్ ఉన్న పరిస్ధితుల్లో దేశంలో ఆర్ధిక వ్యవస్ధ నానా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాలపై పాకిస్తాన్తో పోలిస్తే భారత్ పట్టు పెరుగుతోంది. ఈ రెండు సవాళ్లను ఇమ్రాన్ ఖాన్ అధిగమించలేకపోతే మిలటరీ ఛీఫ్ జనరల్ బజ్వా సైనిక పాలనను తెరపైకి తెచ్చి తన ప్రభుత్వాన్ని కూల్చే ప్రమాదముంది. దీంతో భారత్తో సత్సంబంధాలు నడపడం ద్వారా తీవ్రవాదం కంటే ఆర్ధిక వ్యవస్ధపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడంతో పాటు ఆప్ఘన్ వ్యవహారాలపై పట్టు సాధించడం కోసం ఇమ్రాన్ ప్రయత్నిస్తున్నారు. అందుకే భారత్తో కాల్పుల విరమణకు సిద్ధమయ్యారు. అంతే కాదు కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుపై తన డిమాండ్ల విషయంలోనూ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఫైనల్గా తన ప్రభుత్వం కాపాడుకోవాలంటే భారత్ మీద ఆధారపడక తప్పని పరిస్ధితి ఇమ్రాన్ ఖాన్ది.