బోర్డర్లో పర్యటించిన పాక్ ఆర్మీ చీఫ్: ఎల్ఓసీ వద్ద కీలక స్థావరాల సందర్శన: ఏం జరుగుతోంది?
ఇస్లామాబాద్: మొన్నటిదాకా చైనాతో సరిహద్దు గొడవలు, వివాదాలను ఎదుర్కొంది భారత్. భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలను నిలువరించడానికి ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సి వచ్చింది. కొన్ని నెలల పాటు లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద యుద్ధ మేఘాలు కొనసాగాయి. రక్షణ, దౌత్యపరంగా భారత్ తీసుకొచ్చిన ఒత్తిళ్లు ఫలించడంతో.. డ్రాగన్ కంట్రీ వెనుకంజ వేసింది. వాస్తవాధీన రేఖ వద్ద నుంచి సైనిక బలగాలను వెనక్కి పిలిపించుకుంది. ఒకవంక ఉద్రిక్తత కొనసాగుతోండగానే.. మరోవంక పాకిస్తాన్ సరిహద్దుల్లో కలకలం చెలరేగింది.
ఎల్ఓసీని సందర్శించిన పాక్ ఆర్మీ చీఫ్..
పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ ఖమర్ జావేద్ బజ్వా.. భారత సరిహద్దు వెంబడి ఉన్న నియంత్రణ రేఖ వద్ద పర్యటించారు. ఆయన వెంట రావల్పిండి కార్ప్స్ కమాండర్ లెప్టినెంట్ జనరల్ అజర్ అబ్బాస్ ఉన్నారు. ఎల్ఓసీ వెంట ఉన్న కొన్ని కీలక స్థావరాలను ఆయన సందర్శించారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్.. ఈ మధ్యకాలంలో నియంత్రణ రేఖ వద్ద పర్యటించడం ఇదే తొలిసారి. చలిగాలులు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య కూడా ఆయన ఎల్ఓసీ వద్ద పర్యటించడం, పహారా కాస్తోన్న సైనికులతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.
భారత్కు ఘాటు బదులు..
తన పర్యటన సందర్భంగా బజ్వా.. భారత్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఘాటు విమర్శలు సంధించారు. పసలేని ఆరోపణలు గుప్పించారు. సరిహద్దుల్లో అనవసరంగా తమ దేశ సైనికులను భారత ఆర్మీ రెచ్చగొడుతోందని, కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందాలను తరచూ ఉల్లంఘిస్తూ.. దాన్ని తమపై నెట్టేస్తోందని విమర్శించారు. భారత జవాన్లు ఎప్పుడు కాల్పులకు పాల్పడ్డా.. వారికి ఘాటుగా బదులిస్తామని హెచ్చరించారు.
ఐక్యరాజ్య సమితి పరిశీలన బృందాలపైనా కాల్పులు..
భారత్-పాకిస్తాన్లల్లో ఐక్యరాజ్య సమితి మిలటరీ పర్యవేక్షక బృందాలను ఆర్మీ లక్ష్యంగా చేసుకుంటోందని బజ్వా విమర్శించారు. ఐక్యరాజ్య సమితి బృందాలతో కూడిన వాహనాలు సరిహద్దుల్లో పర్యటిస్తోన్న సమయంలోనే.. కాల్పుల విరమణ ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని, అంతర్జాతీయంగా తమ దేశానికి చెడ్డపేరును తీసుకుని రావడానికి కుట్ర పన్నిందని ఆరోపించారు. ఇలాంటి చర్యలను తాము సమర్థవంతంగా అడ్డుకుంటామని అన్నారు. చలిగాలులను తట్టుకునేలా ఎల్ఓసీ వద్ద ఏర్పాటు చేసిన శిబిరాలు, ఇతర చర్యలను ఆయన పరిశీలించారు.
నిశితంగా పరిశీలిస్తోన్న భారత్..
కారణాలు ఏమైనప్పటికీ.. ఉన్నట్టుండి ఆయన పాక్ ఆర్మీ చీఫ్ నియంత్రణ రేఖ వద్ద పర్యటించడం పట్ల భారత్ అప్రమత్తమైంది. ఆయన పర్యటన, చేసిన వ్యాఖ్యలను నిశితంగా పరిశీలిస్తోంది. సరిహద్దుల్లో పర్యటించడం వెనుక ఎలాంటి కారణాలు ఉన్నాయనే విషయంపై ఆరా తీస్తోంది. పాక్ ఆక్రమిత్ కాశ్మీర్లో ఈ మధ్యకాలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, తరచూ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానికులు ఉద్యమాలు చేపట్టడం వంటి పరిణామాల మధ్య ఆయన నియంత్రణ రేఖ వద్ద పర్యటించడం కలకలం రేపుతోంది.