ప్రత్యర్థుల బుల్లెట్లు అయిపోవాలే తప్ప.. అవి మా గుండెల్లోకి చొచ్చుకెళ్లలేవు: పాక్ ఆర్మీ చీఫ్
పాకిస్థాన్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆదివారం అర్థరాత్రి తర్వాత జరిగిన భారీ పతాక ఆవిష్కరణలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇస్లామాబాద్: శత్రు దేశాలకు పాక్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా హెచ్చరికలు జారీ చేశారు. తూర్పు లేదా పశ్చిమ దేశాలు ఏవైనా.. తమతో అమీతుమీకి దిగితే వారి బుల్లెట్లు అయిపోవాలే తప్ప తమ సైనికుల గుండెల్లోకి చొచ్చుకుపోలేవని స్పష్టం చేశారు.
పాకిస్థాన్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆదివారం అర్థరాత్రి తర్వాత జరిగిన భారీ పతాక ఆవిష్కరణలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ లోని ప్రతీ ఉగ్రవాదిని ఉరి తీస్తామని కూడా చెప్పారు. ఎంతటి శక్తి అయిన తమ లక్ష్యాన్ని బలహీనపర్చలేదని, శత్రుదేశాలు చేసే ఎలాంటి ప్రయత్నాలనైనా తమ దేశ సైన్యం తిప్పికొట్టలదని ధీమా వ్యక్తం చేశారు.
తమదేశం న్యాయబద్దంగా, రాజ్యాంగ బద్దంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దేశానికి ఎన్ని సవాళ్లు ఎదురైనా సరే.. జాతీయవాద భావంతో వాటిని అధిగమిస్తూ ముందుకెళ్తామని చెప్పారు. దేశ ప్రజల త్యాగాలను మరిచిపోలేమని అన్నారు.
కాగా, పాకిస్థాన్ 70వ స్వాతంత్య్ర దినోత్సవానికి సంకేతంగా భారత్-పాక్ సరిహద్దు ప్రాంతమైన అట్టారి-వాఘా వద్ద సుమారు 400 అడుగుల జాతీయ పతాకాన్ని ఆ దేశ సైన్యం ఎగరవేసింది. ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ ఈ పతాకాన్ని ఆవిష్కరించారు. దక్షిణ ఆసియాలో ఇదే అతిపెద్ద జాతీయ పతాకం అని, ప్రపంచంలో ఎనిమిదో అతిపెద్ద పతాకమని చెబుతున్నారు.