భారత సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పాక్.. దాచేసిన నిజం ఇదే!
న్యూఢిల్లీ: ఉగ్రవాదులపై భారత సర్జికల్ దాడులను జీర్ణించుకోలేకపోతున్న పాకిస్థాన్.. పగతో రగిలిపోతోంది. యూరీ ఉగ్రదాడి అనంతరం భారత్ జరిపిన సర్జికల్ స్రైక్స్ అవాస్తమని బుకాయిస్తున్న పాకిస్థాన్.. ఓ పెద్ద రహస్యాన్నే దాచేసింది.
కాగా, భారత సర్జికల్ దాడుల్లో చనిపోయిన ఉగ్రవాదులతోపాటు ఇద్దరు పాక్ సైనికుల మృతదేహాలను ట్రక్కుల్లో రహస్యంగా తరలించి, ఖననం చేశారని సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్న కొందరు ప్రత్యక్ష సాక్షులు ఓ ప్రముఖ జాతీయ మీడియా చేసిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
సెప్టెంబర్ 29న రహస్యంగా మృతదేహాలను శ్మశానానికి తరలించి ఖననం చేశారని తెలిసింది. ఈ సర్జికల్ దాడుల్లో 38 నుంచి 70 మంది దాకా ఉగ్రవాదులను మన సైన్యం మట్టుపెట్టింది. ఈ దాడుల్లో మృతి చెందిన ఉగ్రవాదులు జైషే మొహమ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థలకు చెందిన వారని సమాచారం.
అంతేగాక, ఉగ్రవాదుల స్థావరాలను, సామాగ్రిని సైన్యం ధ్వంసం చేసిందని కొందరు ప్రత్యక్ష సాక్ష్యులు సదరు జాతీయ మీడియాకు తెలిపారు. కాగా, వారి భద్రత దృష్యా వారి పేర్లను వెల్లడించడం లేదని సదరు మీడియా ప్రకటించింది. అయితే, పాక్ మాత్రం భారత సర్జికల్ దాడులు ఉత్తవేనంటూ బయటికి చెప్పుకుంటుండటం గమనార్హం.
ఇది ఇలా ఉండగా, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రస్తుత పరిస్థితిపై ఇస్లామాబాద్ లో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి చర్చలు జరుపుతున్నారు. తాము శాంతిని కోరుకుంటున్నామని, అయితే, తమ దేశం కోసం ఎలాంటి చర్యలకైనా సిద్ధమేనని షరీఫ్ సమావేశంలో పేర్కొన్నట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి.