ఎలుకను చంపి తెస్తే రూ.25 బహుమతి పొందొచ్చు!
పెషావర్: పాకిస్థాన్లోని పెషావర్ నగరాన్ని ఎలుకల సమస్య పీడిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న ఎలుకలను ఎలా అరికట్టాలో తెలియక అక్కడి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల ఓ ఆస్పత్రిలో పసిబిడ్డను ఎలుకలు కొరికి చంపడంతో కఠిన చర్యలకు ఉపక్రమించారు.
ఎలుకల నిర్మూలనలో ప్రజలను భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. ఇందుకో ఓ ఆలోచన చేశారు. ఒక ఎలుకను చంపితే రూ.25 ఇస్తామని ప్రకటించారు. ఒకరు ఎన్ని ఎలుకలనైనా చంపొచ్చు. ఇందుకోసం వాటర్ అండ్ శానిటేషన్ సర్వీస్ సంస్థ నాలుగు పట్టణాల్లో కొన్ని పాయింట్లు ఏర్పాటు చేస్తోంది.
చచ్చిన ఎలుకల్ని తీసుకుని వాటిని తెచ్చిన వారికి.. ఒక్కో ఎలుకకు రూ.25 చొప్పున ఇస్తారు. కొంతకాలంగా అక్కడ సాధారణ ఎలుకల కంటే పెద్దగా 22-30 సెం.మీ.ల పొడవున్న ఎలుకలు ఎక్కువగా సంచరిస్తున్నాయని, ఇవి అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయని, మనుషులను కొరుకుతున్నాయని చెబుతున్నారు.