భారత టెక్నాలజీ భయపెడుతోంది: అత్యాధునిక డ్రోన్లపై పాక్ ఆందోళన
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: అత్యాధునిక భారత డ్రోన్ టెక్నాలజీ తమను ఆందోళనకు గురిచేస్తోందని పాకిస్థాన్ వెల్లడించింది. అమెరికా ప్రిడేటర్ డ్రోన్ల తరహాలో భారత్ తయారు చేసిన రుస్తుం-2 డ్రోన్ను ఉద్దేశించి పాకిస్థాన్ విదేశాంగశాఖ మహమ్మద్ ఫయాసల్ బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్ సైనిక సామర్థ్యాల్లో అభివృద్ధి స్థానిక వ్యూహాత్మక సమతౌల్యాన్ని దెబ్బతీస్తుందని ఆయన బుధవారం నిర్వహించిన ఓ సమావేశంలో వ్యాఖ్యానించారు.
తీవ్రమైన ఒత్తిడి
‘భారతదేశం సంప్రదాయ, సంప్రదాయేతర రంగాల్లో సైనిక సామర్థ్యాలను క్రమంగా కూడగట్టుకోవడం, విస్తరించడాన్ని విస్తృత దృష్టితో చూసినపుడు, ఆ దేశ డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధి ఆందోళనకరం. ఈ పరిణామాలు ప్రాంతీయ వ్యూహాత్మక సుస్థిరతను తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నాయి' అని ఫయాసల్ పేర్కొన్నారు.
టెక్నాలజీ నిబంధనలకు లోబడే..
ఐక్యరాజ్య సమితి చార్టర్కు అనుగుణంగా డ్రోన్ టెక్నాలజీ ఉండాలని అన్నారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వాలు వ్యవహరించవలసిన విధంగా అంతర్జాతీయ చట్టాలకు, అమల్లో ఉన్న నిబంధనలకు అనుగుణంగా ఉండాలన్నారు.
పాక్ నటులపై విద్వేషం ఎందుకు?
పాక్ నటులు భారత్లో నటించకుండా నిషేధించడం విద్వేషపూరిత చర్య అని అన్నారు. అంతేగాక, రెండు సంస్కృతుల మధ్య వారధిగాఉండే సినిమా, కళలు విద్వేషాలకు బందీలుగా మారాయని వ్యాఖ్యానించారు. పాక్ జాతీయులకు భారత్ వీసాలు ఇవ్వకపోవడం, సిక్కులు, కటాస్ రాజ్ యాత్రికులను అనుమతించకపోవడం , క్రీడలను రద్దు చేసుకోవడం వంటివి భారత్ అసహనానికి చిహ్నాలని విమర్శించారు.
భేటీకి అవకాశాల్లేవు
కాగా, ఆఫ్గనిస్థాన్లో భారత్ పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శుల భేటీకి ఉన్న అవకాశాలను ఫయాసల్ తోసిపుచ్చారు. భారత్ విదేశాంగ శాఖ కార్యదర్శి పాకిస్థాన్ వస్తారన్న వార్తల విషయం తెలియదని చెప్పారు.