పౌరసత్వ సవరణ బిల్లునూ వదలని పాకిస్తాన్: హిందుత్వ అనే విషాన్ని..: మళ్లీ ఐక్యరాజ్య సమితి వద్దకు..!
ఇస్లామాబాద్: మనదేశం తీసుకున్న ప్రతి చర్యపైనా విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది పాకిస్తాన్. ఇదివరకు జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై ఏకంగా అంతర్జాతీయ వేదికల మీద పాకిస్తాన్ తన అక్కసును వెల్లగక్కింది. తాజాగా- పౌరసత్వ సవరణ బిల్లుపైనా అదే వైఖరిని కనపరుస్తోంది. పౌరసత్వ సవరణ బిల్లును భారత్ అమలు చేయాలనుకోవడం ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించినట్టవుతుందని చెబుతోంది.
పౌరసత్వ సవరణ బిల్లు: అమిత్షాపై ఆంక్షలు విధిస్తామన్న అంతర్జాతీయ మత స్వేచ్ఛా కమిషన్
ముస్లింల పట్ల విచక్షణకు..
పౌరసత్వ సవరణ బిల్లును లోక్ సభ ఆమోదించడంపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఘాటుగా స్పందించింది. ఇలాంటి చర్యలన్నీ పొరుగు దేశాలను అభద్రతాభావంలోకి నెట్టేస్తాయని పేర్కొంది. ముస్లింల పట్ల విచక్షణధోరణికి భారత ప్రభుత్వం తెర తీసిందని ఆరోపించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి షా మొహమ్మద్ ఖురేషీ పేరు మీద ఓ ప్రకటన విడుదలైంది. పౌరసత్వ సవరణ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని, ఈ చర్యను ఐక్యరాజ్య సమితి వద్ద ప్రస్తావిస్తామని పేర్కొంది.
అంతర్జాతీయ స్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘన..
పౌరసత్వ సవరణ బిల్లును అమలు చేయడానికి సన్నాహాలు చేయడం వల్ల భారత్ అంతర్జాతీయ స్థాయి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించింది. మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నానికి తెర తీసినట్టయిందని మండిపడింది. ఇదివరకే భారత్ తో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలకు సైతం ఈ చర్య విఘాతం కల్పించేదిగా ఉందని విమర్శించింది. ఉద్దేశపూరకంగా పొరుగు దేశాలను రెచ్చగొట్టే చర్యలకు దిగినట్టయిందని వ్యాఖ్యానించింది.
హిందుత్వ అనే విషాన్ని
భారత్ లో నివసించే ప్రతి ఒక్కరు హిందుత్వ సిద్ధాంతాలను అనుసరించేలా చేయడానికే ఆ దేశ ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లును అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని, దీన్ని ఏ ప్రజాస్వామిక దేశం కూడా సమర్థించదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పుకొచ్చింది. మతాలకు అతీతంగా ప్రతి ఒక్క భారతీయుడిలో హిందుత్వ అనే విషాన్ని ఎక్కించే ప్రయత్నానికి భారత ప్రభుత్వం పూనుకుందని పాకిస్తాన్ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఐక్యరాజ్య సమితి వద్దకు..
భారత ప్రభుత్వం తాజాగా చేపట్టిన ఈ చర్యను తాము ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికల మీద ప్రస్తావిస్తామని పేర్కొంది. భారత వైఖరిని ఎండగడతామని, పౌరసత్వ సవరణ బిల్లును వెనక్కి తీసుకునేలా ఒత్తిడిని తీసుకొస్తామని పేర్కొంది. భారత్ తో సరిహద్దులను పంచుకుంటోన్న దేశాల రాజకీయ, పరిపాలనపరమైన చర్యల్లో ఆ దేశ ప్రభుత్వం ఉద్దేశపూరకంగా జోక్యం చేసుకున్నట్టయిందని పేర్కొంది.