కులభూషణ్ జాదవ్ కేసు : భారత లాయర్ నియామకానికి 'నో' చెప్పిన పాకిస్తాన్...
గూఢచర్యం ఆరోపణలతో పాకిస్తాన్ చెరలో బంధీగా ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ను విడిపించేందుకు భారత్ సర్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే పాక్ నుంచి మాత్రం ప్రతికూలతలే ఎదురవుతున్నాయి. పాక్ కోర్టుల్లో జాదవ్ తరుపున వాదించేందుకు తమ లాయర్లకు అనుమతినివ్వాలన్న భారత్ విజ్ఞప్తిని ఆ దేశం కొట్టిపారేసింది.
Recommended Video
'జాదవ్ కేసులో భారత్ చేసే అసమంజసమైన డిమాండ్లను పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు.' అని పాకిస్తాన్ విదేశాంగ ప్రతినిధి జహీద్ హఫీజ్ పేర్కొన్నారు. పాకిస్తాన్ కోర్టులకు సహకరించడం తప్ప భారత్కు మరో ఆప్షన్ లేదన్నారు. కేవలం స్థానిక న్యాయవాదులకు మాత్రమే పాక్ కోర్టుల్లో వాదించేందుకు అనుమతి ఉంటుందన్నారు.
నిజానికి జాదవ్ తరుపున భారత న్యాయవాది నియామకానికి గతంలోనే పాక్ అవకాశం కల్పించిందని... కానీ భారత్ దాన్ని ఉపయోగించుకోలేదని నెల క్రితం పాకిస్తాన్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. మరోవైపు భారత్ మాత్రం పాకిస్తాన్ నుంచి తమకెలాంటి సమాచారం అందలేదని చెప్పింది.
అంతకుముందు, ఇస్లామాబాద్ హైకోర్టు కులభూషణ్ జాదవ్ తరుపున న్యాయవాదిని నియమించుకునేందుకు భారత్కు అవకాశం ఇవ్వాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సమాచారాన్ని భారత్కు పంపించాలని కూడా ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 3కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే కులభూషణ్ జాదవ్ తరుపున న్యాయవాది నియామకానికి భారత్ పాక్కు విజ్ఞప్తి చేయగా... పాకిస్తాన్ దాన్ని తోసిపుచ్చింది.
కాగా,గూఢచర్యం ఆరోపణలతో కులభూషణ్ జాదవ్కు పాకిస్తాన్ కోర్టు మరణశిక్ష విధించగా... భారత్ దాన్ని అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్ చేసి స్టే తెచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి కులభూషణ్ జాదవ్ను 2016,మార్చి 3న బలూచిస్తాన్లో అరెస్ట్ చేశారన్నది భారత్ వాదన. కానీ పాకిస్తాన్ మాత్రం ఆయన్ను ఇరాన్లో అరెస్ట్ చేసినట్లు చెబుతోంది.