పాక్: ముగిసిన ఎన్నికలు, ఫలితాలపై ఉత్కంఠ, ముందంజలో ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ దేశ వ్యాప్తంగా బుధవారం ఉదయం 8గంటలకు ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సాయంత్రం 6:30గంటలకు ముగిసింది. కరాచీ,క్వెట్టాతో సహా మరో ఏడెనిమిది ప్రాంతాల్లో సాయంత్రం 7గంటల వరకు పోలింగ్ కొనసాగింది.
క్వెట్టాలో జరిగిన దాడుల్లో సుమారు 29మంది ఓటర్లు మృత్యువాత పడ్డారు.దీంతో అక్కడ చాలా సేపటికి వరకూ పోలింగ్ నిలిపి వేశారు. దాడులు జరిగిన ప్రాంతాల్లో పోలింగ్ సమయాన్ని పెంచారు. ఓట్ల పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం వెల్లడించలేదు.
ఫలితాలతో పాటు పోలైన ఓట్ల శాతాన్ని ఒకేసారి వెల్లడిస్తామని ఎన్నికల సంఘం కమిషనర్ తెలిపారు. దీంతో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సర్వతా ఉత్కంఠ నెలకొంది.
కాగా, ఈ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ (పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్షాఫ్-పీటీఐ) ముందంజలో ఉండగా, రెండో స్థానంలో నవాజ్ షరీఫ్ పార్టీ(పీఎంఎల్ఎన్), మూడో స్థానంలో బిలావల్ భుట్టో పార్టీ కొనసాగుతోంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ అతిపెద్ద పార్టీ అవతరించే అవకాశాలున్నాయి. దీంతో పాక్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేలా ఉంది.
ఇమ్రాన్ ఖాన్కు అటు సైన్యం, ఇటు ఉగ్రవాదుల మద్దతు కూడా ఉండటం గమనార్హం. కాగా, పార్లమెంటులోని 272 స్థానాలకు 3,459 మంది, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల్లోని 577 స్థానాలకు 8,396 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.