భారత్ అడుగేస్తే, మేం రెండు: కాబోయే పాక్ ప్రధాని ఇమ్రాన్, భారత్ మీడియా, కాశ్మీర్పై కీలకవ్యాఖ్యలు
కరాచీ: భారత్తో సత్సంబంధాలు కోరుకుంటున్నామని, జిన్నా ఆశయాలు నెరవేర్చేందుకు తాను రాజకీయాల్లో వచ్చానని పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ అన్నారు. 22 ఏళ్ల తర్వాత తనకు అవకాశం దక్కిందని చెప్పారు. తాను ఇరవై రెండేళ్ల పాటు రాజకీయాల్లో పోరాటం చేశానని చెప్పారు. తన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కిందని చెప్పారు. ఈ ఎన్నికల కోసం ప్రజలు త్యాగం చేశారన్నారు. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం బలపడుతోందన్నారు.
పాక్ ఫలితాలు: చరిత్ర సృష్టించిన ఇమ్రాన్ ఖాన్! ఏకమైన విపక్షాలు.. ఇదీ తొలిసారే!
ఈ ఎన్నికలు దేశదశను మార్చేవి అన్నారు. పేదల బాధలు తీర్చడమే తన అజెండా అని చెప్పారు. తమ ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుందన్నారు. ఈ ఎన్నికలు చారిత్రాత్మకం అన్నారు. అవినీతిలేని పాలనను అందిస్తానని హామీ ఇచ్చారు. పాకిస్తాన్లో పెట్టుబడుల కోసం విదేశీ సంస్థలను ఆహ్వానిస్తామన్నారు. పక్కదేశాలతో సత్సంబంధాలు అవసరమన్నారు.
ఎన్నికల ఫలితాలు: ఇమ్రాన్ వైపు పాకిస్తాన్ మొగ్గు, ఆయనకు శిక్షపడే ఛాన్స్
బాలీవుడ్ విలన్లా చిత్రీకరిస్తోంది, క్రికెట్కు థ్యాంక్స్
భారత్తో సత్సంబంధాలు కోరుకుంటున్నామని ఇమ్రాన్ చెప్పారు. తనను ఇండియన్ మీడియా బాలీవుడ్ విలన్లా చిత్రీకరిస్తోందని ఆరోపించారు. నాతో నష్టం జరుగుతుందని వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారన్నారు. కానీ భారత్తో ఎక్కువగా సంబంధాలు ఉన్న వ్యక్తిని తానేనని, అందుకు క్రికెట్కు థ్యాంక్స్ అన్నారు. వ్యాపారపరంగా కూడా భారత్ - పాకిస్తాన్ పరస్పరం సహకరించుకోవాలన్నారు. ప్రపంచంలో ఏం జరిగినా జరిగినా వేళ్లు పాకిస్తాన్ వైపే చూపిస్తున్నారన్నారు. ఉప ఖండంలో మన స్నేహం అత్యవసరమని చెప్పారు. శాంతి స్థాపనకు ఇండియా ఒక స్టెప్ తీసుకుంటే పాకిస్తాన్ రెండు అడుగులు ముందుకేస్తుందన్నారు.
కాశ్మీర్ పైన ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు
కాని దురదృష్టవశాత్తు రెండు దేశాల మధ్య సమస్య కాశ్మీర్ అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇరు దేశాలు కూర్చొని మాట్లాడుకొని, కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. ఈ అంశంపై బ్లేమ్ గేమ్ కొనసాగుతోందన్నారు. సమస్య పరిష్కారానికి భారత్ ముందడుగేస్తే మేమూ సిద్ధమన్నారు. సివిల్ సొసైటీలోకి ఆర్మీ రావడంతో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు.
చైనా, ఆప్గనిస్తాన్లపై ఇమ్రాన్ ఖాన్
భారత్ సహా అన్ని దేశాలతో మంచి సంబంధాలు కోరుకుంటున్నట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. అదే సమయంలో కాశ్మీర్లో హక్కుల ఉల్లంఘన ఉందని వ్యాఖ్యానించారు. చైనాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని చెప్పారు. పేదరికం, ఆకలిపై చైనా ఎలా యుద్ధం చేసిందో అలా చేస్తామని, ఆ దేశాన్ని స్ఫూర్తిగా తీసుకుంటామన్నారు. పాక్లోకి పెట్టుబడులకు సీపీఈసీ మంచి అవకాశమని చెప్పారు. ఆప్ఘనిస్తాన్ టెర్రరిజం బారిన పడిందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అక్కడ (ఆప్గనిస్తాన్) శాంతి ఉంటే పాకిస్తాన్లోను శాంతి ఉంటుందని చెప్పారు.
ఇమ్రాన్ ఇలా ప్రధాని పీఠం ఎక్కనున్నారు
పాకిస్తాన్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. స్వతంత్రులు లేదా చిన్న చిన్న పార్టీలతో కలిసి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇమ్రాన్ ఇక పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. పీటీఐకి 120 స్థానాల వరకు వచ్చాయి. మరో పదిహేడు నుంచి ఇరవై స్థానాలు తక్కువపడితే ఇతరుల మద్దతుతో ఇమ్రాన్ ప్రధాని పీఠం ఎక్కనున్నారు.
బిలావల్ ఓటమి
కాగా, పాక్ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రముఖ రాజకీయ నేతలు ఓటమి చవిచూశారు. తాజా ఎన్నికల్లో ప్రధాని రేసులో ఉన్న ఇద్దరు అభ్యర్థులతో పాటు ఇద్దరు మాజీ ప్రధానులూ ఓడిపోయారు. మాజీ అధ్యక్షుడు జర్దారీ, మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ కరాచీ సౌత్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో పీపీపీ పార్టీ తరఫున బిలావల్ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగగా తాజా ఎన్నికల్లో ఆయన ఓటమి చవిచూశారు.
షాబాజ్ షరీఫ్ ఓటమి
పీటీఐకి పోటీగా ఉన్న పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్ఎన్) పార్టీ నుంచి ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగిన షాబాజ్ షరీఫ్ కూడా ఓడిపోయారు. కరాచీ వెస్ట్ నుంచి పోటీ చేశారు. పీఎంఎల్ఎన్ పార్టీకి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే పనామా పత్రాలు వెల్లడించిన అక్రమాస్తుల వ్యవహారంలో ఆయన జైలుకు వెళ్లడంతో పార్టీ బాధ్యతలు నవాజ్ సోదరుడైన షాబాజ్ షరీఫ్ చేపట్టారు.
యూసఫ్ రజా గిలానీ ఓటమి
పాక్ మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ ఓడిపోయారు. ముల్తాన్లోని షుజాబాద్ నియోజకవర్గంలో ఇమ్రాన్ పార్టీ పీటీఐ అభ్యర్థి మహమ్మద్ ఇబ్రహీంపై పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ తరఫున పోటీ చేసిన గిలానీ ఓటమి పాలయ్యారు. గిలానీ 2008 నుంచి 2012 వరకు పాకిస్థాన్ ప్రధానిగా ఉన్నారు. నవాజ్ షరీఫ్పై అనర్హత వేటు పడటంతో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షాహిద్ ఖఖాన్ అబ్బాసీ కూడా పరాజయం పొందారు. ఈ ఎన్నికల్లో అబ్బాసీ రావల్పిండి నుంచి పోటీ చేశారు. అబ్బాసీ 2017 ఆగస్ట్లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది మే నెలలో అబ్బాసీ ప్రధాని పదవి నుంచి వైదొలగడంతో ఆపద్ధర్మ ప్రధానిగా నస్రుల్ ముల్క్ బాధ్యతలు చేపట్టారు.