పీటీఐకి 116 సీట్లు, చర్చలు: ప్రతిపక్షాలు ఏకం.. రోడ్డెక్కితే ఇమ్రాన్కు చుక్కలే
కరాచి: పాక్ ఎన్నికల్లో ఫలితాలు తేలాయి. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐకి 116 స్థానాలు వచ్చాయి. నవాజ్ షరీఫ్కు చెందిన పీఎంఎల్ఎన్ 64, బిలావల్ భుట్టో జర్దారీ పీపీపీకి 43 సీట్లు వచ్చాయి. మిగతా స్థానాల్లో చిన్న పార్టీలు, స్వతంత్రులు గెలిచారు. ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం దిశగా ఇమ్రాన్ ఖాన్ అడుగులు వేస్తున్నారు.
కేంద్ర మంత్రిమండలి కూర్పు, పంజాబ్ ప్రావిన్స్లో ప్రభుత్వ ఏర్పాటు వంటి అంశాలను పార్టీ సహచరులతో ఆయన చర్చిస్తున్నారు. పాకిస్థాన్ స్వాతంత్య్ర దినమైన ఆగస్ట్ 14వ తేదీకి ముందే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి కాస్త అటు ఇటు ఇమ్రాన్ ప్రమాణ స్వీకారం ఉండనుందని చెబుతున్నారు. చిన్న పార్టీలు, స్వతంత్రులు, ఎంక్యూఎం-పీ పార్టీతో ఇమ్రాన్ ఖాన్ పార్టీ చర్చలు జరుపుతోంది.
నా పిల్లల తండ్రి ప్రధాని: ఇమ్రాన్పై జెమీమా, భారత్పై మాజీ క్రికెటర్ విషం
మరోవైపు, ఎన్నికల ఫలితాలను విపక్షాలు అంగీకరించడం లేదు. రిగ్గింగ్ జరిగిందని, కాబట్టి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతున్నాయి. ఈ మేరకు విపక్షాలన్నీ అఖిలపక్షాన్ని నిర్వహించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఏకమై రోడ్లపైకి వస్తే అస్థిరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
ప్రతిపక్షంలో కూర్చునేందుకు తాము సిద్ధమని నవాజ్ షరీఫ్ పార్టీ తొలుత ప్రకటించినా, ఆ తర్వాత విపక్షాలతో కలిసి గొంతు కలిపాయి. రిగ్గింగ్ పైన గళమెత్తుతున్నాయి. పార్లమెంటును బహిష్కరించే యోచన చేస్తున్నారు.
జాతీయస్థాయిలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేదు కాబట్టి పంజాబ్ ప్రావిన్సులోనైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పీఎంఎల్ఎన్ ప్రయత్నాలు చేస్తోంది. పంజాబ్ ప్రావిన్సులో పీఎంఎల్ఎన్ 129 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. సింధ్లో పీపీపీ (76), ఖైబర్ పక్తుంఖ్వాలో పీటీఐ (66), బెలూచిస్తీన్లో బెలూచిస్తాన్ అవామీ పార్టీ (15) నెగ్గాయి.