ఎన్నికల ఫలితాలు: ఇమ్రాన్ వైపు పాకిస్తాన్ మొగ్గు, ఆయనకు శిక్షపడే ఛాన్స్
కరాచీ: పాకిస్తాన్ ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుకున్నారు. క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ వైపు ప్రజలు మొగ్గు చూపారు. 112 స్థానాల్లో ఆ పార్టీ ముందంజలో ఉంది. పీఎంఎల్ఎన్ (నవాజ్ షరీఫ్) పార్టీ 65 స్థానాల్లో ముందంజలో ఉంది. మాజీ అధ్యక్షుడు జర్దారీ పార్టీ పీపీపీ (పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ) 43 స్థానాలతో మూడో స్థానంలో నిలిచింది. దాదాపు 50 స్థానాల్లో ఇతరులు ముందంజలో ఉన్నారు.
Recommended Video
బుధవారం జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 272 స్థానాలకు నేరుగా ఎన్నికలు జరగ్గా, దాదాపు అన్ని స్థానాల్లో ఫలితాల సరళి తేలిపోయింది. ఇటీవల ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడే వరకు అధికారంలో ఉన్న పీఎంఎల్ఎన్ రెండో స్థానంలో ఉండటం గమనార్హం. హంగ్ పార్లమెంట్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పీపీపీ కింగ్మేకర్ పాత్ర పోషించే పరిస్థితి ఉంది. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలోని 272 సాధారణ స్థానాలకు 3,459 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. పంజాబ్, సింధ్, బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్సుల్లో 577 సాధారణ స్థానాలకు 8,396 మంది పోటీ పడ్డారు. 30కి పైగా పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దించాయి.
విపక్షాల విమర్శలు
ఎన్నికల ఫలితాలపై పీఎంఎల్-ఎన్ విమర్శలు గుప్పించింది. ర్యాగింగ్ జరిగిందని ఆరోపించింది. ఎన్నికలను ఒప్పుకునేది లేదని చెప్పింది. దీంతో ఫలితాల సరళి ఆలస్యమవుతోంది. ఇమ్రాన్ ఖాన్ వేసిన ఓటు ప్రత్యక్ష ప్రసారమైంది. దీంతో ఎన్నికల సంఘం ఆయనను పిలిచి వివరణ కోరింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు ఆయన ఓటును రద్దు చేసే అవకాశముంది. ఓటు హక్కును రహస్యంగా వినియోగించుకోకుంటే ఆరు నెలల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధించే అవకాశముంది. పీఎంఎల్ఎన్ అధిపతి షాబాజ్ షరీఫ్ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడటాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది.
హింసాత్మకం, పలువురు మృతి
ఓటింగ్ సమయంలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముంబై దాడి ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్ ఉద్ దవా అభ్యర్థులు చాలామంది ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. హింసాత్మక సంఘటనల మధ్య ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ మొదలయిన కొద్ది గంటలకు ఐసిస్ ఆత్మాహుతి బాంబర్ ఒకరు బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలోని భోసా మండి ప్రాంతంలో పేల్చేసుకున్నాడు. ఈ దాడిలో పోలీసులు సహా 31 మంది మరణించారు. వేర్వేరు సంఘటనల్లో జరిగిన ఘర్షణల్లో మరికొందరు మరణించారు.
జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యులుంటారు. అందులో 272 మందిని నేరుగా ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు. 60 స్థానాలు మహిళలకు, పది స్థానాలు మతపరంగా అల్పసంఖ్యాక వర్గాలకు కేటాయించారు. ఐదు శాతంకు పైగా ఓట్లు వచ్చిన పార్టీలకు దామాషా పద్ధతిన స్థానాలు కేటాయించి, వీరిని ఎంపిక చేస్తారు. మేజిక్ ఫిగర్ 172. ఏకైక అతిపెద్ద పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 137 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు నేరుగా ఎన్నికై ఉండాలి.