హఫీజ్ సయీద్ చుట్టూ ఉచ్చు: మరో షాకిచ్చిన పాకిస్తాన్, వెనుక చైనా ఉందా?
ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాతే చీఫ్ హఫీజ్ సయీద్ చుట్టూ పాకిస్తాన్ మరింత ఉచ్చు బిగించింది.
కరాచీ: ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాతే చీఫ్ హఫీజ్ సయీద్ చుట్టూ పాకిస్తాన్ మరింత ఉచ్చు బిగించింది. దేశం దాటి బయటకు వెళ్లే వీలు లేకుండా అతడిని ఎగ్జిట్ కంట్రోల్ జాబితాలో చేర్చింది.
ట్రంప్-మోడీ వల్లే నా అరెస్ట్: హఫీజ్ సయీద్ ఉక్కిరిబిక్కిరి, భారత్ ఘాటుగా..
హఫీజ్తో పాటు నలుగురు ముఖ్య అనుచరులను గత రెండు రోజుల క్రితం హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. తద్వారా హఫీజ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
ఈ మేరకు పాక్ హోంమంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని ప్రావిన్సులతో పాటు ఫెడరల్ దర్యాప్తు సంస్థకు లేఖ రాసింది. అతడితో పాటు లష్కరే తొయిబా, జమాతుద్ దవా ముష్కర సంస్థలతో సంబంధమున్న 38మంది అనుచరుల పేర్లను ఆ జాబితాలో చేర్చారు.
అమెరికా ప్రభుత్వం ఒత్తిడి మేరకు అతడిపై చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. జమాతుద్ దవాపై చర్యలు తీసుకోకుంటే ఆంక్షలు తప్పవని అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో పాక్ అతడిని గృహనిర్బంధంలోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
కాగా, అతడిపై త్వరలో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఆ దేశ మంత్రి ఒకరు బుధవారం వెల్లడించారు. అయితే, హఫీజ్ సయీద్ అరెస్టు వెనుక అమెరికా కాదని, చైనా ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.