పెషావర్ స్కూల్ కాల్పుల కీలక సూత్రధారి హతం
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని పెషావర్ సైనిక పాఠశాలలో జరిగిన ఉగ్రవాద కాల్పులకు కీలక సూత్రధారి సద్దాంను పాకిస్థాన్ భద్రతా దళాలు మట్టుపెట్టాయి. పాఠశాల కాల్పుల సూత్రధారిని ఖైబర్ కనుమలో హతమార్చినట్లు పాక్ దళాలు ప్రకటించాయి.
‘గురువారం జామ్రుడ్ గుండి ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో సద్దాం మృతి చెందాడు. అతనికి సంబంధించిన ఒక సహాయకుడ్ని ప్రాణాలతో పట్టుపడ్డాడు' అని ఖైబర్ ఏజెన్సీ పెషావర్ పొలిటికల్ ఏజెంట్ షాహెబ్ అలీ షా మీడియాకు తెలిపారు.
డిసెంబర్ 16న పెషావర్ సైనిక పాఠశాలలో ఏడుగురు తాలిబన్ ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 150 మంది మృతి చెందారు. ఇందులో ఎక్కువమంది విద్యార్థులే కాగా, మరికొందరు ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది ఉన్నారు. పాఠశాలలో కాల్పుల ఘటన తర్వాత పాకిస్థాన్ ఉగ్రవాదులపై దాడులను ముమ్మరం చేసింది.
కాగా, అమెరికాకు చెందిన రెండు డ్రోన్లు ఉత్తర పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై మిస్సైళ్లను ప్రయోగించాయి. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఏడుగురు ఉగ్రవాదులు మృతి చెంది ఉండవచ్చని పాకిస్థానీ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.