Ayodhya verdict: అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల పాకిస్తాన్ అక్కసు: ఇంకొన్ని రోజులు ఆగలేరా అంటూ.
ఇస్లామాబాద్: చారిత్రాత్మక అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల పాకిస్తాన్ తనకు బాగా అలవాటైన ధోరణిలోనే అక్కసును వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు రామజన్మభూమికి అనుకూలంగా రావడం పట్ల అసహనాన్ని వ్యక్తం చేసింది. సున్నితమైన అంశంపై తన తీర్పును వెలువరించడానికి భారత అత్యున్నత న్యాయస్థానం ఇంకొన్ని రోజులు ఎందుకు ఆగలేకపోయిందని ప్రశ్నించింది. చారిత్రాత్మక అంశంపై తీర్పును వెల్లడించడానికి ఇది సరైన సమయం కాదని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ అన్నారు. ఇంకొన్ని రోజులు ఆగలేకపోయారా? అని ప్రశ్నించారు.
మందిరానికి లైన్ క్లియర్: మసీదుకు అయిదెకరాల భూమి: అయోధ్యలోనే మందిర్..మసీదు..!
కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవం నాడే ఎందుకు?
భారత్, పాకిస్తాన్ మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడానికి గుర్తుగా చెబుతున్న కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవం శనివారమే. అదే రోజు రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించింది. ఒకేరోజు ఈ రెండు ఘట్టాలు చోటు చేసుకున్నాయి. కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవం నాడే అయోధ్యపై తీర్పును వెల్లడించడం సరి కాదని మహమ్మద్ ఖురేషీ అన్నారు. దీని వల్ల కర్తార్ పూర్ కారిడార్ కు ప్రాధాన్యత లభించకుండా పోయిందని అభిప్రాయపడ్డారు. భారత్ ఉద్దేశపూరకంగా ఇలా ప్రవర్తించడం బాధాకరమని చెప్పారు.
సంతోష సమయాన్ని పక్కదారి పట్టించేలా..
ఈ తీర్పు కోసం భారత్ కొన్నేళ్ల పాటు ఎదురు చూసిందని, ఇంకొద్ది రోజులు ఎందుకు ఆగలేకపోయిందని ఆయన చెప్పారు. కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కు సంబంధించినంత వరకు కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవం అత్యంత సంతోషకరమైన రోజు అని, అలాంటి సందర్భాన్ని పక్కదారి పట్టించేలా భారత్ ప్రవర్తించిందని అన్నారు. అయోధ్య భూ వివాదం అనేది అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైన అంశమని, అలాంటి కేసుపై తీర్పును వెలువరించే రోజు ఖచ్చితంగా ఇది కాదని ఖురేషీ చెప్పారు.
భారతీయ ముస్లింలపై తీవ్ర ఒత్తిడి..
ఇప్పటికే భారతీయ ముస్లింలపై తీవ్ర ఒత్తిడి ఉందని, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. వారిపై మరింత ఒత్తిడి పెరుగుతుందని వ్యాఖ్యానించారు. ఉద్దేశపూరకంగానే ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయాన్ని తీసుకుని ఉండొచ్చని తాను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు అనైతికమని, చట్ట వ్యతిరేకమైనదని ఆయన సహచర మంత్రి ఫవాద్ హుస్సేన్ అన్నారు. ఈ తీర్పు విషయంలో సుప్రీంకోర్టు స్వతంత్రంగా వ్యవహరించలేదనే విషయం స్పష్టమైందని ఆయన అన్నారు. రాజకీయ ఒత్తిళ్లతోనే తీర్పు చట్టానికి విరుద్ధంగా వెలువడిందని చెప్పారు.