లఖ్వీకి బెయిల్ మంజూరుపై సుప్రీం కోర్టుకు పాక్ ప్రభుత్వం
లాహోర్: ముంబయి పేలుళ్ల సూత్రధారి జకి ఉర్ రెహ్మాన్ లఖ్వీకి న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీని విధించింది. ఈ మేరకు ఇస్లామాబాద్ కోర్టు లఖ్వీకి 14రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. లఖ్వీని తిరిగి జనవరి 15న కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
లఖ్వీకి బెయిల్ మంజూరు చేయడాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం గురువారం నాడు సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. లఖ్వీకి బెయిల్ మంజూరు పైన భారత్ ఆగ్రహించడంతో పాటు, నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో లఖ్వీకి డిసెంబర్ 18వ తేదీన ఉగ్రవాద వ్యతిరేక కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది. పెషావర్లో పాఠశాలలో తీవ్రవాదులు 149 మంది చిన్నారులు, ఉపాధ్యాయులను పొట్టన పెట్టుకున్న రెండు రోజులకే ఉగ్రవాద వ్యతిరేక కోర్టు అతనికి బెయిల్ ఇవ్వడం గమనార్హం. అనంతరం పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి.
లఖ్వీని పాకిస్తాన్ ప్రభుత్వం రెండు రోజుల క్రితం మరోసారి అదుపులోకి తీసుకుంది. మంగళవారం నాడు లఖ్వీ తరఫు న్యాయవాదులు మాట్లాడుతూ.. అతనిని మరోసారి అరెస్టు చేశారని చెప్పారు. తాము దీనిని కోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు. అంతర్గత ఒత్తిడుల వల్ల లఖ్వీ తన ప్రాథమిక హక్కును కోల్పోయేలా చేస్తున్నారని వాపోయారు.
ముంబైలో 2008నాటి ఉగ్రవాద దాడులకు ప్రధాన సూత్రధారి జాకీర్ రెహ్మాన్ లఖ్వీ విషయంలో పాకిస్థాన్ దోబూచులాట ఆడుతున్న విషయం తెలిసిందే. కరుడుగట్టిన ఈ ఇస్లామిక్ ఉగ్రవాది నేరచరిత్ర జగద్విదితమే అయినప్పటికీ ప్రస్తుతం కటకటాల్లో ఉన్న అతనికి ఏదోవిధంగా స్వేచ్ఛను ప్రసాదించేందుకు తిప్పలు పడుతున్నట్లుగా కనిపించింది.
లఖ్వీని నిర్బంధిస్తూ ఇటీవల సర్కార్ జారీ చేసిన శాంతిభద్రతల పరిరక్షణ ఉత్తర్వుపై (ఎంపీవో)కోర్టులో విచారణకు ప్రభుత్వ తరఫున న్యాయవాది గైర్హాజరు కావడంతో ఆ తీవ్రవాదికి సులభంగా మళ్లీ బెయిల్ వచ్చేలా సహకరించింది. అయితే, భారత్ నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో మరో కేసులో అదుపులోకి తీసుకోవడంతో పాటు, ఇప్పుడు సుప్రీంను ఆశ్రయించింది.