భారత సిక్కులకు పాకిస్తాన్ విసాలు.. 10 వేల మందికి: అక్కడే భోజనం.. నిద్ర
ఇస్లామాబాద్: మనదేశానికి చెందిన 10 వేల మంది సిక్కులకు పాకిస్తాన్ విసాలను మంజూరు చేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత భారత్ అంటే ఒంటి కాలి మీద లేస్తోన్న పాకిస్తాన్.. ఏకంగా అంత మందికి విసాలను జారీ చేయడం ఆశ్చర్యానికి గురి చేయడం సహజమే. దీనికి కారణం మాత్రం వేరే. అదే- కర్తార్ పూర్ కారిడార్. సిక్కుల మత గురువు గురునానక్ 550వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని తమ దేశ భూభాగంపై ఉన్న కర్తార్ పూర్, నన్కనా ప్రాంతాలను సందర్శించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది.
చైనా..పాకిస్తాన్ వైపేనా? ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీర్, డోక్లామ్: కళ్లు కాయలు కాచేలా ఇమ్రాన్
రెండు ప్రాంతాల మధ్య యుద్ధపూరిత వాతావరణం నెలకొన్నప్పటికీ.. గురునానక్ జన్మస్థలమైన నన్కనా, ఆయన బోధనలకు కేంద్ర బిందువుగా నిలిచిన కర్తార్ పూర్ ప్రాంతాలను సందర్శించడంపై ఎలాంటి ప్రభావం చూపలేదు. విసాలను చాలా పరిమితంగా మంజూరు చేసిందని అంటున్నారు. కర్తార్ పూర్, నన్కనాలను సందర్శించడానికి విసాల కోసం భారత్ కు చెందిన సిక్కు సమాజం నుంచి వేల సంఖ్యలో దరఖాస్తులు అందినప్పటికీ.. 10 వేలకే పరిమితం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది తొలిదశ మాత్రమేనని అంటున్నారు.
కర్తార్ పూర్ కారిడార్ యాత్ర వచ్చేనెల 8వ తేదీన ప్రారంభం కానుంది. తొలి విడత రెండు వేల మందికి పైగా సిక్కు యాత్రికులు పాకిస్తాన్ కు బయలుదేరి వెళ్తారు. పంజాబ్ సరిహద్దుల్లోని వాఘా నుంచి అటారీ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక రైలులో వారు నన్కనా సందర్శనకు బయలుదేరి వెళ్తారు. నన్కనా తరువాత కర్తార్ పూర్ ను సందర్శించి తిరిగి స్వదేశానికి చేరుకుంటారు. నాలుగు రోజుల పాటు చెల్లుబాటయ్యేలా పాకిస్తాన్ వారికి విసాలను మంజూరు చేసినట్లు సమాచారం. సిక్కు యాత్రికులకు భోజనం, నివాస వసతిని పాకిస్తాన్ ప్రభుత్వం కల్పించింది.