ముషార్రఫ్పై హత్యాయత్నం కేసులో దోషికి ఉరి
పెషావర్: మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషార్రఫ్పై హత్యాప్రయత్నం కేసులో దోషిగా తేలిన వ్యక్తిని పాకిస్తాన్ బుధవారంనాడు ఉరి తీసింది. మరణశిక్షపై మారిటోరియాన్ని ఎత్తేసిన తర్వాత పాకిస్తాన్లో ఇది ఏడో ఉరి శిక్ష అమలు. పాకిస్తాన్ వైమానిక దళం జూనియర్ సాంకేతిక నిపుణుడైన నియాజ్ మొహమ్మద్ ముషార్రఫ్పై జరిగిన హత్యా ప్రయత్నం కేసులో దోషిగా తేలాడు.
నియాజ్ మొహమ్మద్ను బుధవారం ఉదయం పెషావర్లోని కేంద్ర కారాగారంలో ఉరి తీశారు. ముషార్రఫ్పై 2008లో రావల్పిండిలో హత్యాప్రయత్నం జరిగింది. నియాజ్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రొవిన్స్లో స్వాదీ జిల్లాకు చెందినవాడు. మంగళవారం వరకు అతన్ని హరిపూర్ కేంద్ర కారాగారంలో ఉంచారు. అక్కడి నుంచి అతన్ని పెషావర్కు తరలించినట్లు డాన్ న్యూస్ రాసింది.
ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉడడంతో పాలనాయంత్రాంగం జైలులోనూ, దాని చుట్టూ భారీగా పోలీసులను, సైనికులను మోహరించింది. ఉరితీతను పర్యవేక్షించడానికి మెజిస్ట్రేట్ను పంపించాలని కోరుతూ జైళ్ల శాఖ సూపరింటిండెంట్ పెషావర్ జిల్లా న్యాయమూర్తికి లేఖ రాశారు.
ఇప్పటి వరకు పాకిస్తాన్లో ఉరి తీసిన ఏడుగురిలో ఆరుగురు ముషార్రఫ్పై హత్యాప్రయత్నం కేసులో దోషులే. మరొకతను 2009లో సైనిక కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో దోషి. ముషార్రఫ్పై 2003 డిసెంబర్ 14వ తేదీన రాల్పిండిలో హత్యాప్రయత్నం జరిగింది.