పాకిస్థాన్ డబుల్ గేమ్, అందుకే సహయం నిలిపివేత: నిక్కీహేలీ
వాషింగ్టన్: ఉగ్రవాదంపై పోరు విషయమై గత కొన్నేళ్ళుగా పాకిస్థాన్ డబుల్ గేమ్ ఆడుతోందని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ ఆరోపించారు. పాక్కు రూ.1700 కోట్ల సైనిక సహయాన్ని అమెరికా నిలిపివేసిన విషయాన్ని ఐక్యరాజ్యసమితిలో నిక్కీ హేలీ ప్రకటించారు.
పాకిస్థాన్ కొంత కాలంగా ఉగ్రవాదం విషయంలో డబుల్ గేమ్ ఆడుతోందని ఆమె గుర్తు చేశారు. పాకిస్థాన్ తమతో ఉన్నట్టుగానే ఉంటూ ఆఫ్ఘనిస్థాన్ లో తమ దళాలపై దాడులు జరుపుతున్న ఉగ్రవాదులకు అండగా ఉంటోందని నిక్కీ హేలీ చెప్పారు.
పాక్ ఆడుతున్న డబుల్ గేమ్ను అమెరికా యంత్రాంగం ఏమాత్రం ఒప్పుకోదన్నారు. ఉగ్రవాదంపై పోరు విషయంలో పాక్ నుంచి ఇంకా ఎక్కువ సహకారం కోరుకుంటున్నట్లు చెప్పారు.
నిక్కీ హేలీ ప్రకటన చేసిన వెంటనే ఉగ్రవాదంపై వ్యతిరేకంగా పాక్ చర్యలు తీసుకునేలా ఒత్తిడి తెస్తామని అమెరికా అధ్యక్ష నివాసం శ్వేతసౌధం ప్రకటించింది. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు పాక్ ఇంకా చర్యలు తీసుకోవచ్చని.. మేము అదే కోరుకుంటున్నామని శ్వేతసౌధం అధికార ప్రతినిధి సారా శాండర్స్ తెలిపారు.